నిర్మల్: తెలంగాణ వ్యాప్తంగా వానలు రికార్డు స్థాయిలో పడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు తోడు నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కడెం ప్రాజెక్టు స్థాయికి మించి ప్రవహిస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద రావడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని బయటకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టుకు 18 గేట్లు ఉండగా వాటిలో నాలుగు విరిగిపోయాయని అధికారులు వెల్లడించారు.
గేట్ల మరమ్మతులకు నిపుణులను పిలిపించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం 14 గేట్లను ఎత్తి గోదావరి నదిలోకి 2.19 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసినట్లు వివరించారు. గేట్లు తెరవడంతో దిగువ ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు హెలికాప్టర్లను ఉపయోగించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వర్షాలు, వరదల నేపథ్యంలో కడెం ప్రాజెక్టును పరిశీలించేందుకు ఎమ్మెల్యే రేఖానాయక్తో కలిసి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వెళ్లారు. వారితో పాటు ఉన్నతాధికారులు కూడా వెళ్లారు. అయితే ప్రాజెక్టు పరిస్థితి ప్రమాదకరంగా ఉందని అధికారులు హెచ్చరించడంతో వెనుదిరిగారు. ఎమ్మెల్యే రేఖానాయక్తోపాటు ఇతర అధికారులు హడావుడిగా వెనుదిరిగారు. వరద తగ్గితే కట్టమైసమ్మకు ప్రత్యేక పూజలు చేస్తానని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.