హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారయింది. ఆగస్టు 3 నుంచి శాపనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు శానససభతో పాటు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నవంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఎన్నికలకు ముందు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ఆసక్తి నెలకొంది.
ఈ సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇతర విధాన నిర్ణయాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది. పాలక BRS UCCని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతేకాదు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో బ్యూరోక్రాట్ల నియామకంలో కేంద్రానికి సంపూర్ణ అధికారాలను అప్పగించడానికి తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను సైతం సీఎం కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు.
అంతేకాదు విపక్ష కాంగ్రెస్ ధరణి పోర్టల్పై లేవనెత్తిన ఆందోళనలు, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏర్పడిన మౌలిక సదుపాయాలపై చర్చించేందుకు కూడా సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. నాలుగైదు రోజుల పాటు సభ జరిగే అవకాశం ఉందని, ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధిపై సమగ్ర నివేదికను సీఎం కేసీఆర్ అందజేస్తారని నేతలు తెలిపారు.
అయితే ప్రతిపక్షాలు ఈ అసెంబ్లీ సమావేశాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. కేసీఆర్ నెరవేర్చని హామీలు, ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి నిలదీయనున్నాయి. వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, వదర బాధితులకు సాయం, రాష్ట్రంలోని ఇతర సమస్యలపై చర్చించాల్సిందిగా ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టే అవకాశముంది. ఎన్నికలు ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.