హైదరాబాద్: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగర విస్తరణను దృష్టిలో ఉంచుకుని ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ – అర్బన్ డెవలప్మెంట్ మంత్రి కెటి రామారావు మాట్లాడుతూ…
హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్ను పౌర విమానయానానికి రెండో విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు.
ఈ మేరకు రక్షణ శాఖతో సమన్వయం చేసుకుంటూ హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం జీఎంఆర్ ఎయిర్పోర్టు నుంచి ఏటా సుమారుగా 2.5 కోట్ల మంది విమాన సేవలను పొందుతుండగా.. వచ్చే ఐదేళ్లలో మరింత పెరిగే అవకాశం ఉంది.
దీనికి తోడు ఫార్మా సిటీ, జీనోమ్ వ్యాలీ, విదేశీ పెట్టుబడులు, పారిశ్రామిక విధానాలతో నగర విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. ఎయిర్ కార్గో సేవలకు హైదరాబాద్ కేంద్రంగా మారుతుండగా అత్యంత రద్దీ ఎయిర్పోర్టుల జాబితాలో శంషాబాద్ నిలిచింది.
ప్రస్తుతం హైదరాబాద్ విస్తరిస్తున్నట్లుగా నగరానికి రెండో ఎయిర్ పోర్టు అనివార్యంగా మారింది. దీనికి గోవా తరహాలో రక్షణ శాఖ ఎయిర్పోర్టులో విమాన సేవలు ప్రారంభించినట్లుగానే.. నగరంలోని హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ను వినియోగిస్తే విమాన సేవలు మరింత మెరుగుపడుతాయని ప్రభుత్వం భావిస్తున్నది.
దీనికి హకీంపేట్ ఎయిర్పోర్టు నుంచి పౌర విమాన సేవలు ప్రారంభించేలా కేంద్రాన్ని కోరుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతో ఈ నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలిపితే హైదరాబాద్ కేంద్రంగా రెండో పౌర విమానయాన కేంద్రం ఏర్పాటు కానున్నది.