హైదరాబాద్ : నగర శివారు ప్రాంతమైన కోహెడలో ఆసియాలోనే అతి పెద్ద పండ్ల మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. సుమారు 403 కోట్ల రూపాయల ఖర్చుతో.. 199 ఎకరాల విస్తీర్ణంలో ఈ పండ్ల మార్కెట్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. అధునాతన హంగులు, సకల సౌకర్యాలతో ఈ మార్కెట్ను నిర్మించనున్నారు.
ఈ క్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి బుధవారం కోహెడ మార్కెట్ నిర్మాణ వ్యయం, ప్రణాళికపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సాహించేందుకు గాను సీఎం కేసీఆర్ ఈ మార్కెట్ నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు.
199 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ మార్కెట్ ప్రాంతంలో 48.71 ఎకరాల్లో షెడ్ల నిర్మాణం చేపట్టారు. కమీషన్ ఏజెంట్లతో సహా అందరికీ దుకాణాలు సైతం నిర్మిస్తున్నారు. 16.50 ఎకరాల విస్తీర్ణంలో కోల్డ్ స్టోరేజీ, 11.76 ఎకరాల్లో పండ్ల ఎగుమతి కోసం ఎక్స్పోర్ట్ జోన్, 56.54 ఎకరాల్లో రోడ్లు, 11.92 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు. మార్కెట్ నిర్మాణ ప్రణాళికకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలపడంతో పనులు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు.
ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో హోం మంత్రి, మహమూద్ అలీ, పాతబస్తీ ఎమ్మెల్యేలు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మిబాయి తదితరులు పాల్గొన్నారు.