హైదరాబాద్: భూముల వేలంలో కోకాపేట కోట్లు కురిపించింది. నిధుల సమీకరణ కోసం కోకాపేట నియోపోలీస్ లేఅవుట్లోని ప్లాట్ నెం.6, 7, 8, 9లో భూముల విక్రయ ప్రక్రియను హెచ్ఎండీఏ గురువారం చేపట్టింది.
ఈ వేలంలో సగటున ఎకరం రూ. 72 కోట్ల లెక్కన అమ్ముడైనట్టు వివరించారు. తొలి సెషన్లో 6, 7, 8, 9 ప్లాట్లకు ఈ వేలం నిర్వహించగా.. అత్యధికంగా ఒక్కో ప్లాటుకు రూ. 68 కోట్ల నుంచి రూ. 75 కోట్ల వరకు ధర పలికింది. 10, 11, 14 ప్లాట్లకు రెండో సెషన్లో ఈ వేలం నిర్వహించగా.. రికార్డు స్థాయిలో ధర పలికింది. ఇందులో అత్యధికంగా 10వ నంబరు ప్లాట్ ఎకరానికి రూ.100.75 కోట్లు పలకగా.. అతి తక్కువగా రూ. 67.25 కోట్లు పలికింది.
తొలి విడతలో హెచ్ఎండీఏకు రూ.1,533 కోట్ల ఆదాయం వచ్చింది. సగటు భూమి ధర గజం రూ.1.5 లక్షలు. మొత్తం 45.33 ఎకరాల్లో ఏడు ప్లాట్లతో రూ.2,500 కోట్ల వరకు సమీకరించాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. ప్రభుత్వం ఎకరాకు కనీస ధర రూ.35 కోట్లుగా నిర్ణయించింది. కానీ ఇక్కడ భూముల ధరలు అంతకు రెట్టింపు పలకడం విశేషం.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధిచేసిన కోకాపేట నియోపోలిస్ లేఅవుట్లో ప్లాట్లు కొంత కాలంగా వేలం వస్తున్నారు. 2021లో మొదటి ఆన్లైన్ వేలం నిర్వహించారు. మొత్తం దాదాపు 50 ఎకరాల విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను వేలం వేశారు. అప్పట్లో ఎకరం కనీస ధర రూ.25 కోట్లు నిర్ణయించగా, బిడ్డర్లు పోటీ పడి మరీ స్థలాలను దక్కించుకున్నారు.
ఇందులో ఎకరానికి కనిష్ఠంగా రూ.31.2 కోట్లు పలకగా, గరిష్ఠ ధర రూ.60.2 కోట్లు పలికింది. మొత్తం వేలం ప్రక్రియలో సరాసరిగా ఎకరం రూ.40.05 కోట్లు పలికింది. 2/పీ వెస్ట్ పార్ట్ గల ప్లాట్ను రాజపుష్ప ప్రాపర్టీస్ సంస్థ ఎకరానికి రూ.60.20 కోట్ల చొప్పున 1.65 ఎకరాలను రూ.99.33 కోట్లకు సొంతం చేసుకున్నది. మొత్తంగా కోకాపేట భూముల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.2000.37 కోట్ల ఆదాయం సమకూరింది.
హైదరాబాద్ స్టాండర్డ్ను ఈ వేలం ధరలు మరోమారు రుజువు చేశాయని హైదరాబాద్ క్రెడాయ్ శాఖ జనరల్ సెక్రటరీ వి. రాజశేఖర్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం వెస్ట్ సిటీలో ఆకాశహర్మ్యాలు విస్తరిస్తున్న క్రమంలో.. నియోపోలీస్ స్థలాల కోసం బడా సంస్థలు పోటీపడినట్టు నిపుణులు చెప్తున్నారు.