హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగు నీరు అందించేందుకు ఉద్దేశించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఇన్ని రోజులు ప్రధాన అడ్డంకిగా ఉన్న అనుమతులు లభించాయి. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గురువారం న్యూఢిల్లీలో జరిగిన 49వ సమావేశంలో నిపుణుల అంచనాల కమిటీ (ఈఏసీ) ఈసీని సిఫార్సు చేసింది. గత నెల 24న నిర్వహించిన 49వ ఈఏసీలో మరోసారి తెలంగాణ సర్కారు తరఫున తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ వాదనలు వినిపించారు.
ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను బలంగా నొక్కి చెప్పారు. ప్రాజెక్టుకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని, కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చాలని ఈఏసీకి తెలంగాణ సర్కారు గతంలో విజ్ఞప్తి చేసింది. అయితే ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అంచనాలను సమర్పించాలని ఈఏసీ గతంలో తెలంగాణకు సూచించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఇరిగేషన్ అధికారులు అందుకు సంబంధించిన నివేదికలను సైతం ఈఏసీకి అందజేశారు. వాటన్నింటిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈఏసీ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సిఫారసు చేయడం విశేషం.
మహబూబ్నగర్, నాగర్కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, నారాయణపేటతో సహా ఆరు జిల్లాల్లో ఏకకాలంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి 2021 ఆగస్టు 10న నిర్వహించిన పబ్లిక్ హియరింగ్ తర్వాత నివేదికను EAC పరిశీలించింది.
ఈఏసీ సిఫార్సులు
- ఈ ప్రాజెక్టు పనుల్లో పర్యావరణకు హాని పనులు జరక్కుండా ఉపశమన చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు అథారిటీకి పర్యావరణ శాఖ సూచించింది. ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్దేశించింది.
- ప్రాజెక్టు నిర్మాణంలో దెబ్బతిన్న పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేసేందుకు, పరిస్థితులు సరిదిద్దేందుకు 153.70 కోట్ల రూపాయలు కేటాయించాలని పేర్కొంది. పీసీబీ చెప్పినట్టు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆ డబ్బులు జమ చేస్తున్నట్టు గ్యారీటీ పీసీబీకి చూపించాలని తెలిపింది.
- ప్రాజెక్టు పూర్తైన తర్వాత అక్కడ పర్యావరణం ఎలా ఉంటుందో అధ్యయనం చేయాలని చెప్పింది.
- ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లోని ప్రజలకు గోబర్ గ్యాస్, సోలార్ ప్యానెల్స్ అందివ్వాలని సూచించింది.
- గతంలో ఎన్జీటీ చెప్పినన సూచనలు పాటించాలని పేర్కొంది.
- జలాశయం పరిధిలోని 500 మీటర్ల వెడల్పుతో చెట్లను భారీగా పెంచాలని సూచించింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో పెరుగుతున్న మొక్కలనే పెంచాలన్నారు.
- అక్కడ జీవ వైవిధ్యం దెబ్బతినకుండా అటవీ ప్రాణులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలి.
- ప్రాజెక్టు ముంపు ప్రాంతాల ప్రజలకు ఉద్యోగ శిక్షణ కోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వారికి ఉపాధి కల్పించాలి. ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్ వంటి వాటిలో శిక్షణ ఇవ్వాలి.
- ప్రాజెక్టు పరిధిలోని ప్రజలకు వైద్య సేవలు, మౌలిక వసతలు కల్పించాలి. వారికి సురక్షిత మంచి నీరు అందేలా చర్యలు తీసుకోవాలి.
ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు 12.38 లక్షల ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది ప్రభుత్వం. 2016లో నిర్మాణానికి చర్యలు తీసుకున్నప్పటికీ కేసులు ఇతర అనుమతులు కారణంగా ఇన్ని రోజులు డిలే అవుతూ వచ్చింది.
ఈ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ని రోజుకు 1.5 టీఎంసీల చొప్పున లిఫ్ట్ చేయనున్నారు. 90 టీఎంసీలు ఎత్తి పేసేందుకు నాలుగు లిఫ్టులు, ఐదు రిజర్వాయర్లు – నార్లాపూర్ జలాశయం, ఏదుల జలాశయం, కరివెన జలాశయం, ఉదండాపూర్ జలాశయం ఏర్పాటు చేశారు. వీటిలో చాలా వాటి పనులు 50 శాతానికిపైగా పూర్తినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు అనుమతులు రావడంతో వాటిని మరింత వేగవంతం చేయనున్నట్టు వెల్లడించింది.