హైదరాబాద్: ఎన్నికల ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా, హైదరాబాద్తో సహా తెలంగాణలోని అన్ని జిల్లాల ఓటర్ల జాబితాల నుండి మొత్తం 73 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను సోమవార విడుదల అయింది. తెలంగాణలో మొత్తం 3 కోట్ల 38 లక్షల 26 వేల 448 మంది ఓటర్లు ఉండగా.. 2 కోట్ల 64 లక్షల 87 వేల 213 మంది ఎన్యూమరేషన్ పత్రాలను డిజిటలైజేషన్ చేశారు. నోటీసులు అందుకునే 92 లక్షల 87 వేల ఓటర్లలో ఎంత మంది అర్హుత సాధిస్తారనేది పరిశీలించి తర్వాతి తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. అయితే ఎస్ఐఆర్ తర్వాత ఓటర్ల లిస్టులో పేరు కోల్పోయినవారు తిరిగి ఓటు పొందే హక్కు ఉంటుంది.
SIR ద్వారా హైదరాబాద్ ఓటర్ల జాబితా నుండి 19 లక్షల పేర్లు తొలగింపు
హైదరాబాద్ ఓటర్ల జాబితా నుండి 19,41,444 పేర్లు తొలగించారు; తెలంగాణ జిల్లాల్లో ఇదే అత్యధికం. వీరిలో 1,56,392 మంది మరణించినట్లుగా, 2,99,850 మంది ఆచూకీ లేనివారిగా, 13,45,333 మంది శాశ్వతంగా నివాసం మారినవారిగా, 99,264 మంది ఇప్పటికే నమోదైనవారిగా (ద్వి-నమోదు), 40,605 మంది ఇతర కారణాల వల్ల తొలగించారు.
హైదరాబాద్లోని నియోజకవర్గాల వారీగా చూస్తే, మలక్పేటలో అత్యధికంగా 1,47,779 పేర్లు తొలగించారు. ఆ తర్వాతి స్థానంలో ముషీరాబాద్ (1,40,070 తొలగింపులు) ఉంది. అత్యల్పంగా చార్మినార్ నియోజకవర్గంలో 94,174 పేర్లు తొలగించారు.
ఇక జిల్లాల వారీగా చూస్తే, హైదరాబాద్ జిల్లాలో అత్యధిక సంఖ్యలో పేర్లు తొలగించారు. ఇక్కడ ఓటర్ల జాబితా 19 లక్షలకు పైగా తగ్గింది. ఆ తర్వాతి స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉంది, ఇక్కడ 12,87,091 పేర్లు తొలగించారు. మేడ్చల్-మల్కాజిగిరిలో 10,71,566 పేర్లు, అత్యల్పంగా యాదాద్రి-భువనగిరి జిల్లాలో 26,121 ఓట్లను తొలగించారు.
కాగా, ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు ‘అభ్యంతరాలు, క్లెయిమ్ల’ (Claims and objections) సమయంలో ‘ఫారం-6’ సమర్పించి తిరిగి జాబితాలో చేరే అవకాశం ఉన్నందున, ఈ సంఖ్యలు మారవచ్చు.
