అంకారా: సిరియాలోని ఇద్లిబ్ ప్రావిన్స్లో ఉన్న అబు అల్-ధుహూర్ సైనిక వైమానిక స్థావరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులను టర్కీ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు సిరియా ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు సిరియాకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం చేసిన ఆరోపణలను టర్కీ తిరస్కరించింది.
“ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం చేసిన ఈ నిరాధారమైన ఆరోపణలు, సిరియా సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరుపుతున్న చట్టవిరుద్ధమైన వైమానిక దాడులను చట్టబద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని” టర్కీ కమ్యూనికేషన్స్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇడ్లిబ్పై వైమానిక దాడులు
మంగళవారం ఉదయం, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు సిరియా వాయువ్య ప్రాంతంలోని ఇడ్లిబ్ ప్రావిన్స్లో ఉన్న అబు అల్-దుహూర్ సైనిక విమానాశ్రయం రన్వేను లక్ష్యంగా చేసుకుని ఎనిమిది వైమానిక దాడులు జరిపాయి. దీంతో విమానాశ్రయ మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లింది.
ఇజ్రాయెల్లో జరగబోయే ఎన్నికల ముందు, ఈ ప్రాంతంలో నెతన్యాహు తన “విస్తరణవాద, అస్థిరపరిచే విధానాలను” కొనసాగించాలనే ఉద్దేశం నుండే ఈ ఆరోపణలు పుట్టుకొచ్చాయని అంకారా పేర్కొంది.
“అంతర్జాతీయ సమాజంలోని అత్యధిక దేశాల వలె, టర్కీ కూడా మన ప్రాంతంలో శాశ్వత శాంతిని కోరుకుంటుంది. నెతన్యాహు తన దూకుడు, బలవంతపు విధానాలను విడనాడి, అంతర్జాతీయ చట్టాన్ని గౌరవించడమే దీనిని సాధించడానికి ఏకైక మార్గం” అని ఆ ప్రకటన పేర్కొంది.
సిరియాలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి సిరియా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తమ నిబద్ధతను టర్కీ పునరుద్ఘాటించింది. “సిరియాలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును నెలకొల్పడానికి టర్కీ చట్టబద్ధమైన ప్రాతిపదికన సిరియా ప్రభుత్వంతో దృఢంగా సహకరించడం కొనసాగిస్తుంది. సిరియా అస్థిరతను ఎప్పటికీ అనుమతించదని” ఆ ప్రకటన పేర్కొంది.


