హైదరాబాద్: నగరంలోని ట్రాఫిక్ జంక్షన్ల వద్ద భిక్షాటన చేసే కొన్ని కుటుంబాలు నెలకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నాయి! అవును, మీరు సరిగ్గా చదివారు. ఇటీవల నగరంలో ‘బిచ్చగాళ్ల మాఫియా’పై అణిచివేత సమయంలో పోలీసులు ఆయా కుటుంబాలతో మాట్లాడినప్పుడు ఈ విషయం బయటపడింది. ఈ ‘కుటుంబాలు’ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రై కమిషనరేట్లలో ట్రాఫిక్ జంక్షన్లను పూర్తిగా తమ అజమాయిషీలో ఉంచుకొని బిక్షాటన కొనసాగిస్తున్నాయి.
“భర్త, భార్య, నలుగురైదుగురు పిల్లలు, వృద్ధులతో సహా మొత్తం కుటుంబం ఒక జంక్షన్ను తమ స్వాధీనంలో ఉంచుకుంటుంది. ఇతరులను అక్కడికి వచ్చేందుకు అనుమతించదు. సగటున, వారు రోజుకు 4,000 నుండి 7,000 రూపాయల వరకు సంపాదిస్తారని ” హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ అధికారి ఒకరు తెలిపారు. ప్యారడైజ్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, కెబిఆర్ పార్క్, మాసబ్ ట్యాంక్, అబిద్ రోడ్, ట్యాంక్ బండ్, కోటి ఉమెన్స్ కాలేజ్, చాంద్రాయణగుట్ట,మెహదీపట్నం వంటి రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్ను ఈ ముఠాలు ఎంచుకుంటారు. ఈ ప్రాంతాలను తమకు తాముగా విభజించుకుని, ఎక్కడ వివాదాలు తలెత్తినా, పెద్దలు జోక్యం చేసుకుంటారు. ఈ సమూహాల మధ్య విభిన్న టైమింగ్ స్లాట్లు లేదా వేర్వేరు ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్లను కేటాయించడం ద్వారా స్నేహపూర్వక పరిష్కారం సూచిస్తారు.
“బిక్షాటన చేసే కుటుంబాలు ఉదయం 10 గంటలకు ఆటో రిక్షాలలో వచ్చి రోజంతా జంక్షన్లో ఉంటారు. సాయంత్రానికి ఆటో రిక్షాల ద్వారా తమ ఇళ్లకు చేరుకుంటారు’’ అని అధికారి తెలిపారు. వీరిలో కొందరు కుటుంబాలు కూడా అప్పుల వ్యాపారం చేస్తున్నాయని, ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు బిర్యానీ పొట్లాలతో పాటు మద్యం లేదా కల్లు తీసుకుంటారని పోలీసులు గుర్తించారు.
ఆదాయంతో ఆకర్షితులై కొందరు అసాంఘిక వ్యక్తులు మాఫియాను ఏర్పాటు చేసి శారీరకంగా వికలాంగులు, పిల్లలు, వృద్ధులు, స్త్రీలకు ఉపాధి కల్పించడం ప్రారంభించారు. “రోజు సాయంత్రానికి, నిర్వాహకులు ఒక్కొక్కరికి 200 రూపాయలు చెల్లిస్తారు. ఆహారం, వసతిని నిర్వాహకులు అందిస్తారు” అని DCP (పశ్చిమ) జోయెల్ డేవిస్ చెప్పారు. పిల్లలతో సహా 23 మందికి ఉపాధి కల్పించిన గుల్బర్గాకు చెందిన అజిత్ పవార్ (28) అనే వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు మొన్న పట్టుకున్నారు. అతడి నుంచి ఎనిమిది వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చిట్ ఫండ్ వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాడని, కర్ణాటకలో ఓ రెండు ఇళ్లు ఉన్నట్లు తెలిసింది.