హైదరాబాద్: వైద్యవిద్యలో తెలంగాణ విప్లవం సృష్టించింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఉన్న ఏకైక రాష్ట్రంగా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసుకున్న మొదటి రాష్ట్రం తెలంగాణాయేనని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇప్పటికే మిగతా జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కాగా, తాజాగా మరో 9 జిల్లాల్లో… జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, అసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలలో నూతన మెడికల్ కాలేజీలను ఈనెల 15వ తేదీన ప్రారంభించుకోబోతున్నట్టు మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని 9జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రులు కేటీఆర్ శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో 15 నుంచి 20 వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహించాలన్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో విద్యార్థులకే కాకుండా, అనుబంధంగా ఏర్పాటయ్యే హాస్పిటల్తో స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో కార్యక్రమాలు చేపట్టాలి. ఈ కార్యక్రమాల్లో యువతను, విద్యార్థులను భాగస్వాములను చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
2014లో ఎంబీబీఎస్ సీట్ల విషయంలో తెలంగాణ అట్టడుగున ఉండగా, ఇప్పుడు అత్యధిక ఎంబీబీఎస్ సీట్లతో అగ్రస్థానానికి చేరుకుందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు టెలికాన్ఫరెన్స్లో వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో ప్రతి లక్ష మందికి 22 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో కేవలం రెండు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని, ఒకటి నిజామాబాద్లో, మరొకటి ఆదిలాబాద్లో ఏర్పాటు చేశారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భవించక ముందు, వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఇతర రాష్ట్రాలు, ఉక్రెయిన్ లేదా రష్యాకు వెళ్లేవారు. ఇప్పుడు కేసీఆర్ కృషి కారణంగా తమ రాష్ట్రంలోనే వైద్య విద్యను అభ్యసించనున్నారని మంత్రి అన్నారు. తెలంగాణ ఇప్పుడు ఆహార ఉత్పత్తిలోనే కాదు.. దేశ ఆరోగ్యానికి కీలకమైన డాక్టర్లను తయారుచేసే కార్ఖానాగా ఎదిగిందన్నారు కేటీఆర్.