న్యూఢిల్లీ: దేశ రాజధానిలో విషాదం చోటుచేసుకుంది. నిన్న మధ్యాహ్నం ఢిల్లీలోని సత్య నికేతన్లో ఆరు అంతస్తుల భవనం కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందారు, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. 11 మందిని రక్షించారు. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనను “విచారకరం”గా అభివర్ణించారు. “ఢిల్లీలోని సత్య నికేతన్లో భవనం కూలిపోవడం విచారకరం. ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
కాగా, 75 పడకల పేయింగ్ గెస్ట్ వసతిగా ఉన్న ఈ భవనం నిన్న మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఈ భవనం యజమాని గురుగ్రామ్లో నివసిస్తున్నారు. సత్య నికేతన్ ఢిల్లీ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ సమీపంలో ఉంది. ఇక్కడ విద్యార్థులు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు.
“స్థానిక విచారణలో, ఇది 40-50 ఏళ్ల నాటి భవనమని, ఇందులో ఒక బేస్మెంట్, ఐదు అంతస్తులు ఉన్నాయని, దీనిని పీజీ వసతిగా ఉపయోగిస్తున్నారని వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగినప్పుడు బేస్మెంట్లో మరమ్మతు పనులు జరుగుతున్నాయి,” అని పోలీసులు తెలిపారు.
“ఢిల్లీ పోలీసులు, ఎన్డిఆర్ఎఫ్, ఢిల్లీ ఫైర్ సర్వీస్, డిడిఎంఎ బృందాలు, ఫైర్ టెండర్లు అంబులెన్స్లతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. జాయింట్ సీపీ/న్యూ ఢిల్లీ రేంజ్, డీసీపీ/సౌత్-వెస్ట్ డిస్ట్రిక్ట్ మరియు అదనపు డీసీపీ ఈ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు,” అని వారు తెలిపారు.
కూలిపోయిన సమయంలో భవనంలో కనీసం 50 మంది విద్యార్థులు ఉన్నారని భావిస్తున్నట్లు ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఆదివారం కావడంతో చాలా మంది ‘ఇంట్లోనే’ ఉన్నారని ఆమె తెలిపారు. శిథిలాల కింద నుండి సహాయం కోసం కేకలు విన్నానని సంఘటనా స్థలంలో ఉన్న ఒక విద్యార్థి ఏఎన్ఐ వార్తా సంస్థకు చెప్పాడు. కూలిపోయిన భవనం ‘హాస్టల్ డేజ్’ అనే పురుషుల పీజీ అని మరో ప్రత్యక్ష సాక్షి వర్ణించారు.
ఆన్లైన్లో షేర్ చేసిన ఒక వీడియోలో, ఒక వ్యక్తి కాంక్రీట్ స్లాబ్ కింద ఇరుక్కుని ఉండగా, పలువురు దానిని పైకి లేపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. ప్రారంభంలో కనీసం 12 అగ్నిమాపక వాహనాలను ఘటనా స్థలానికి పంపించారు. సహాయక చర్యల కోసం ఒక ఎక్స్కవేటర్ను రంగంలోకి దించారు. ఘటనా స్థలంలో పనిచేస్తున్న అగ్నిమాపక బృందాలకు సహాయపడటానికి విపత్తు ప్రతిస్పందన బృందాలను కూడా మోహరించారు.
భవనం కూలిపోవడం పట్ల తాను తీవ్ర ఆందోళన చెందుతున్నానని, సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. “ముందస్తు జాగ్రత్త చర్యగా పక్కనే ఉన్న భవనాన్ని ఖాళీ చేయించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించడానికి, బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాము, సంబంధిత ఏజెన్సీలన్నీ సమన్వయంతో పనిచేస్తున్నాయి. ప్రతి పౌరుడి భద్రత, క్షేమమే మా ప్రథమ ప్రాధాన్యత,” అని ఢిల్లీ సీఎం అన్నారు.
“ఘటనా స్థలంలో సమీక్ష జరిపిన అనంతరం, ప్రాథమిక అంచనా ఆధారంగా, ఈ ఘటనపై మేజిస్ట్రేట్ విచారణకు, భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదుకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఘోర ఘటనకు బాధ్యులైన వారిని పూర్తిస్థాయిలో జవాబుదారీగా చేసి, చట్ట ప్రకారం అత్యంత కఠినమైన నిబంధనల ప్రకారం శిక్షిస్తారు,” అని ఆమె తెలిపారు.


