చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. భారతీయ జనతా పార్టీ , ఎన్డీఏ (NDA)తో పొత్తును తెగతెంపులు చేసుకున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని తమ పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించిందని, బిజెపి, ఎన్డీఏతో అన్ని బంధాలను తెంచుకోవాలని అన్నాడిఎంకె ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ఎఐఎడిఎంకె డిప్యూటీ కోఆర్డినేటర్ కెపి మునుసామి ప్రకటించారు.
బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో తలెత్తిన సమస్యలను మునుసామి ప్రస్తావిస్తూ, అన్నాడీఎంకే మాజీ నేతలపైన, తమ ప్రధాన కార్యదర్శి ఈపీఎస్ పైన, తమ పార్టీ కార్యకర్తలపైన ఏడాదిగా బీజేపీ అనుచిత వ్యాఖ్యలు చేస్తోందన్నారు. అటు బీజేపీతోనూ, ఇటు ఎన్డీయేతోనూ అన్నిరకాల పొత్తులకు ఉద్వాసన చెప్పాలని అన్నాడీఎంకే నిర్ణయం తీసుకోవడానికి ఇదొక కారణమని చెప్పారు.
కాగా, బీజేపీతోనూ, ఎన్డీయేతోనూ అన్నాడీఎంకే తెగతెంపులు చేసుకున్నట్టు ప్రకటించగానే ఆ పార్టీ కార్యకర్తలు చెన్నైలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై మాట్లాడుతూ.. ‘నేను మీతో తర్వాత మాట్లాడతాను, యాత్రలో మాట్లాడను.. అని అన్నారు. దివంగత ద్రవిడ నాయకుడు సిఎన్ అన్నాదురై గురించి బిజెపి రాష్ట్ర చీఫ్ కె అన్నామలై చేసిన వ్యాఖ్యల చుట్టూ ఇటీవలి వివాదం నేపథ్యంలో, అన్నాడిఎంకె సీనియర్ నాయకుడు జయకుమార్ సెప్టెంబర్ 18న రెండు పార్టీల మధ్య పొత్తుకు స్వస్తి పలికారు.