హైదరాబాద్: హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా 2 వేల 306 సీసీటీవీ కెమెరాలను, వాటన్నింటిని ఒకేసారి పర్యవేక్షించే వెసులుబాటు ఉన్న మెగా స్క్రీన్ను హోంమంత్రి మహమ్మద్ అలీ ప్రారంభించారు. తద్వారా ప్రజా భద్రత, వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (TSPICCC) దాని మల్టీ-ఏజెన్సీ ఆపరేషన్స్ సెంటర్ (MAOC) హోదాను పటిష్టం చేయడం సాధ్యమవనుంది.
అంతేకాదు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో జరిగే ఘటనలను సీసీ కెమెరాల్లో చూసే వెసులుబాటు ఈ మెగా స్క్రీన్ ద్వారా కలగనుంది. దీని ద్వారా అన్ని విభాగాలను నిమిషాల వ్యవధిలో అప్రమత్తం చేయనున్నారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షించడంలో రాష్ట్ర పోలీసులు దేశంలోనే నంబర్ వన్ గా నిలిచారని మహమూద్ అలీ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో లక్షల సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. పబ్లిక్ సేఫ్టీలో సీసీటీవీ కెమెరాలు కీరోల్ పోషిస్తున్నాయని అన్నారు. ఈ ఏడాది హుస్సేన్ సాగర్లో 14 వేలకు పైగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం అవుతున్నాయని చెప్పారు. సేఫ్ సిటీ, విమెన్ సేఫ్టీ ప్రాజెక్టులో భాగంగా 2,500 కెమెరాలను ప్రారంభించినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వీటిని ట్రాఫిక్, లా అండర్ ఆర్డర్, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేస్తామని అన్నారు.