హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. ప్రిలిమ్స్ పరీక్ష రద్దు సబబేనని కోర్టు తెలిపింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ దాఖలు చేసిన అప్పీలును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకొని మళ్లీ గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించాలని హైకోర్టు టీఎస్పీఎస్సీకి తేల్చి చెప్పింది.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసిన విషయం తెలిసింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై బుధవారం విచారించిన కోర్టు సింగిల్ జడ్జి తీర్పును సమర్థించింది. ప్రభుత్వ రిట్ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ మరోసారి నిర్వహించక తప్పనిపరిస్థితి నెలకొంది.
పేపర్ లీకేజీ వ్యవహరం తర్వాత జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ను టీఎస్పీఎస్సీ రెండోసారి నిర్వహించింది. ఈ పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేదని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని అభ్యర్థులు కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు పరీక్ష మళ్లీ నిర్వహించాలని తీర్పు ఇచ్చారు.