ప్రధానాంశాలు
- ఆకలిసూచీలో మన దేశానికి 111వ ర్యాంక్
- 2022లో మనకు 107వ స్థానం
- సూడాన్, రువాండా, కాంగో మనకంటే ఎంతో మెరుగు
- పాకిస్థాన్, బంగ్లా, శ్రీలంక కంటే కూడా తీసికట్టు
- వరల్డ్ హంగర్ ఇండెక్స్లో సంచలన వాస్తవాలు
- నివేదికను తప్పుబట్టిన కేంద్రప్రభుత్వం
న్యూఢిల్లీ: మన దేశంలో ఆకలి కేకలు పెరుగుతున్నట్లు గ్లోబల్ హాంగర్ ఇండెక్స్ 2023 ద్వారా వెల్లడైంది. మొత్తం 125 దేశాలను పరిగణనలోకి తీసుకొంటే 28.7 హంగర్ స్కోరుతో భారత్ 111వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ర్యాంకుతో పోలిస్తే ఈ దఫా నాలుగు స్థానాలు కిందకు దిగజారింది.
భారత్ పొరుగు దేశాలైన పాకిస్థాన్ (102వ స్థానం), బంగ్లాదేశ్ (81వ స్థానం), నేపాల్ (69వ స్థానం), శ్రీలంక (60వ స్థానం) సూచీలో దాని కంటే మెరుగ్గా ఉన్నాయి.
పేద దేశాలుగా పిలిచే సూడాన్, రువాండా, నైజీరియా, ఇథియోపియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో పాటు యుద్ధంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ (44)తో పోలిస్తే భారత్ దారుణమైన ర్యాంకుకు పడిపోవడం గమనార్హం.
అంతేకాదు దేశంలోని పిల్లల్లో పోషకాహార లోపం రేటు అత్యధికంగా 18.7 శాతంగా ఉందని కూడా ఈ నివేదిక పేర్కొంది. భారతదేశంలో ‘ఆకలి’ పరిస్థితి తీవ్రంగా ఉందని అభివర్ణించారు. అయితే.. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 నివేదికను భారత్ తిరస్కరించింది. ఇలాంటి అవాస్తవ నివేదికలు మన దేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమని కేంద్రం పేర్కొంది. తాజా ఇండెక్స్ గురువారం విడుదలైంది.