న్యూయార్క్: ఇజ్రాయిల్, హమాస్ మధ్య తక్షణమే కాల్పుల విరమణ జరగాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఓ తీర్మానం చేసింది. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా గాజాలో కాల్పులను విరమణకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి డిమాండ్ చేసింది. అమెరికా మాత్రం ఈ ఓటింగ్కు గైర్హాజరైంది.
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఐక్యరాజ్యసమితి నుంచి ఈమేరకు పిలుపు రావడం ఇదే మొదటిసారి. మొత్తం 15 మంది సభ్యదేశాలున్న భద్రతా మండలిలో.. గాజాలో కాల్పుల విరమణ ప్రకటించాలని కోరుతూ సోమవారం తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి 14 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా.. శాశ్వత సభ్యదేశమైన అమెరికా మాత్రం దూరంగా ఉంది. ఇజ్రాయేల్కు మద్దతుగా ఉన్న అమెరికా.. ఓటింగ్ సమయంలో మాత్రం తన వీటో అధికారాన్ని వినియోగించకపోవడం గమనార్హం. దీంతో 14-0 తేడాతో తీర్మానం నెగ్గింది.
ఐరాస తీర్మానం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన అమెరికా తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెలీయుల విడుదలకు, కాల్పుల విరమణకు ముడి పెట్టకుండా తీర్మానం ఆమోదం పొందడానికి అవకాశం కల్పించిందని మండిపడ్డారు.