విజయపుర (కర్ణాటక) : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . ఇటీవల మోదీ ప్రసంగాలను గమనిస్తే ఆయన భయపడ్డట్టు కనిపిస్తోందని, రాబోయే రోజుల్లో మోదీ స్టేజీపైనే కన్నీళ్లు కూడా పెడతారేమోనని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలోని విజయపుర ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ…బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుందని అన్నారు. “చాలా మంది బిజెపి నాయకులు రాజ్యాంగాన్ని రద్దు చేయడం లేదా దానిని మార్చడం లేదా దాని స్థానంలో కొత్తది తీసుకురావడం గురించి మాట్లాడుతున్నారు. మిగతా చాలా మంది నేటి సమస్యలకు రాజ్యాంగ నిబంధనలే కారణమని చెప్పడానికి ప్రయత్నించారు. బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే మనకు తెలిసిన రాజ్యాంగాన్ని అంతం చేస్తుందని దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తోంది. వారికి ఓటు వేయకుండా ఉంటే మనం ఈ విపత్తును ఆపగలం” అని రాహుల్ గాంధీ అన్నారు.
“ప్రజలు తమ అన్ని హక్కులను రాజ్యాంగం నుండి పొందారని మనం మరచిపోకూడదు. అంతకు ముందు భారతదేశాన్ని రాజులు, మహారాజులు పాలించేవారు. నేడు సామాన్యులు, పేదలు, దళితులు, గిరిజనులు గళం విప్పుతున్నారంటే దానికి కారణం మన రాజ్యాంగం. దాన్ని మనం ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడుకోవాలి” అని రాహుల్ గాంధీ అన్నారు.
“ఈ దేశ ప్రజలకు ఒక ఛాయిస్ ఉంది. ఒక వైపు బీజేపీ, రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న మోడీ. మరోవైపు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసిన కాంగ్రెస్ పార్టీ – భారత కూటమి. రాజ్యాంగాన్ని పరిరక్షించే వారికి మద్దతివ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను’ అని రాహుల్ అన్నారు.
‘దేశ సంపదను తమకు అనుకూలమైన 22మంది సంపన్నులకు బీజేపీ పంచింది. ప్రధాని మోదీ శ్రీమంతులకు ఇచ్చిన సొమ్మును రైతులకు పంచడమే తమ పథకమని రాహుల్ అన్నారు. గడిచిన పదేళ్లలో బిలియనీర్లకు మాత్రమే మోదీ మద్దతు ఇచ్చి పోషించారని విమర్శించారు. అదానీకి పెద్ద ప్రాజెక్టులు కట్టబెట్టారని, పేదలకు ఏమిచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఇచ్చిన ఐదు గ్యారంటీలతో పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని చెప్పారు.