న్యూఢిల్లీ: మూడో దశ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో దాదాపు 13 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు కాగా, 29 శాతం మంది కోటీశ్వరులు అని ప్రైవేట్ ఎలక్షన్ వాచ్డాగ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ విశ్లేషణలో వెల్లడైంది.
మే 7న జరిగిన లోక్సభ ఎన్నికల మూడో విడతలో మొత్తం 1,352 మంది అభ్యర్థులను విశ్లేషిస్తూ, 172 మంది అభ్యర్థులపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని, ఇందులో ఐదుగురు హత్యానేరాలు, 24 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయని పేర్కొంది.
పార్టీలవారీగా చూస్తే.. మూడో విడత ఎన్నికల బరిలో బీజేపీకి చెందిన 82 మంది అభ్యర్థుల్లో 22 మంది (27 శాతం)పై, కాంగ్రెస్ పార్టీకి చెందిన 68 మంది అభ్యర్థుల్లో 26 మంది (38 శాతం)పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది.
బీహార్లో ఆర్జేడీ పార్టీ తరపున పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థుల్లో ముగ్గురిపై (100 శాతం) కూడా కేసులు ఉన్నాయని పేర్కొంది. శివసేన (ఉద్ధన్)కు చెందిన 80 శాతం మంది అభ్యర్థులపై, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ( శరద్ పవార్)కి చెందిన 67 శాతం అభ్యర్థులపై, సమాజ్వాదీ పార్టీకి చెందిన 50 శాతం అభ్యర్థులపై, జనతాదళ్ (యునైటెడ్) కి చెందిన 33 శాతం అభ్యర్థులపై, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 శాతం మంది అభ్యర్థులపై కేసులు ఉన్నాయి..
మూడోవిడతలో 95 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. 43 నియోజకవర్గాల్లో (45%) రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఏదైనా లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కనీసం ముగ్గురిపై క్రిమినల్ కేసులున్న సందర్భాల్లో అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంటారు.
మరోవంక ఐదుగురు అభ్యర్థులు తమకు ఆస్తులు లేవని ప్రకటించగా, దక్షిణ గోవా అభ్యర్థి పల్లవి శ్రీనివాస్ డెంపో రూ. 1,361.68 కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్నులుగా నిలిచారు, బీజేపీకి చెందిన జ్యోతిరాదిత్య సింధియా (గుణ) రూ. 424.74 కోట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఛత్రపతి షాహూ షాహాజీ రూ. రూ.342.86 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది.
అదే సమయంలో అత్యంత పేద అభ్యర్థి కొల్హాపూర్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇర్ఫాన్ అబుతాలిబ్ చంద్ కేవలం 100 రూపాయలే ఉన్నాయి.