హైదరాబాద్: తెలంగాణ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకం కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6,500 కోట్లు విడుదల చేయకపోవడంతో 13 లక్షల మంది విద్యార్థులు నిధుల విడుదల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
గత ప్రభుత్వం వాగ్దానం చేసిన ఈ నిధులు బడ్జెట్ పరిమితుల కారణంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, నర్సింగ్ వంటి వివిధ వృత్తిపరమైన కోర్సుల విద్యార్థులకు అందజేయలేదు.
గత నాలుగు సంవత్సరాలుగా స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైంది, దీంతో చాలా ప్రొఫెషనల్ కాలేజీలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి, ఈ పథకాలకు బడ్జెట్ను కేటాయించలేదు. దీంతో అనేక కళాశాలలను మూసివేతకు, మరికొన్ని షట్డౌన్ అంచుకు చేరడానికి కారణమైంది.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… కళాశాల అధికారులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి, గడువు దాటిన చెల్లింపులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. గత ఎనిమిది నెలలుగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నామని, బ్యాంకు రుణాలు చెల్లించడంలో ఇబ్బందులను ఎత్తిచూపుతూ బాధిత కాలేజీల యాజమాన్యం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంది. తక్షణం ఆర్థిక సాయం అందకపోతే మరిన్ని కాలేజీలను మూసి వేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు జూన్లోగా బకాయిలను విడుదల చేయాలని ప్రొఫెషనల్ కాలేజీల సమాఖ్య అభ్యర్థించింది. పేద, అర్హులైన విద్యార్థుల అవసరాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తమ సమస్యలను చర్చించడానికి కోరినా… కళాశాల ప్రతినిధులను కలవలేదని ఫెడరేషన్ తెలిపింది.
2023 సెప్టెంబర్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూ.1,500 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఆర్థిక శాఖ నిలిపివేయడంతో ఈ నిధులు కళాశాలల ఖాతాల్లో జమ కాలేదు. సెప్టెంబర్లో హామీ ఇచ్చిన నిధులను మొదటి విడతగా విడుదల చేసేలా ఆర్థిక శాఖను ఆదేశించాలని కళాశాల నిర్వాహకులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
ఇంజనీరింగ్, ఫార్మసీ, MBA, నర్సింగ్, ఇతర వృత్తిపరమైన కోర్సులను అందించే కాలేజీలు ఫెడరేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ కాలేజీల సమాఖ్యలో ఉన్నాయి.