న్యూఢిల్లీ: దేశంలో 1975లో ఎమర్జెన్సీ విధించిన జూన్ 25వ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’గా కేంద్రం ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శించింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఇది మరో కపట ప్రచార ఎత్తుగడగా పేర్కొంది. దీనికి కౌంటర్గా జూన్ 4వ తేదీని ‘మోదీ ముక్త దివస్’గా జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దేశంలో ఇటీవల సార్వత్రిక ఎన్నికల ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడ్డాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది…పూర్తి మెజారిటీని సాధించలేకపోవడాన్ని కాంగ్రెస్ పరోక్షంగా తన విమర్శల్లో ప్రస్తావించింది.
2016లో డీమోనిటైజేషన్ ప్రకటించిన రోజున ప్రతి సంవత్సరం నవంబర్ 8న భారత ప్రజలు ‘ఆజీవిత హత్యా దివస్’ని జరుపుకుంటారని, గెజిట్ నోటిఫికేషన్ను కూడా విడుదల చేస్తామని ప్రతిపక్ష పార్టీ ఈ నిర్ణయాన్నికూడా తప్పుబట్టింది.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ (ఇన్చార్జ్, కమ్యూనికేషన్స్), జైరాం రమేష్ మాట్లాడుతూ… “దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిస్తున్న జీవాతీత (నాన్ బయోలాజికల్) ప్రధానికి భారత ప్రజలు నైతిక ఓటమిని అందించిన 2024 జూన్ 1 చరిత్రలో మోదీ ముక్తి దివస్ నిలిచిపోతుంది” అని అన్నారు. ఈ జీవాతీత ప్రధాని పరివారమే మనుస్మృతి స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్న కారణంగా 1949 నవంబరులో భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఈ జీవశాస్త్రేతర ప్రధానమంత్రికి డెమోక్రసి అంటే డెమో క్రుషి అని అర్థమైనట్లుగా ఉందని జైరాం రమేష్ తన ట్విట్లో ప్రధాని మోదీపై వ్యంగ్య బాణాన్ని సంధించారు.
ఈ సందర్భంగా పెద్దనోట్లను రద్దు చేస్తూ 2016లో ప్రధాని మోదీ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను కూడా జైరాం రమేశ్ Xలో షేర్ చేశారు. భాజపా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందన్న ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా.. గాంధీ హత్య జరిగిన జనవరి 30వ తేదీని ‘గాంధీ హత్యాదివస్’గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.