న్యూఢిల్లీ: భారతదేశానికి స్వాతంత్య్రం, ఆధునిక భారతదేశాన్ని రూపొందించడంలో ముస్లిం పాత్రను చాలా మంది చరిత్రకారులు విస్మరించారని ఢిల్లీలో జరిగిన ఓ సెమినార్లో వివిధ వక్తలు అభిప్రాయపడ్డారు.
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింలు పోషించిన పాత్ర గురించి అవగాహన కల్పించేందుకు జమాతే ఇస్లామీ హింద్ (JIH), ఢిల్లీ యూనిట్ ఒక సంవత్సరం పాటు సాగిన ప్రచారంలో భాగంగా “మేకింగ్ ఆఫ్ మోడ్రన్ ఇండియా అండ్ రోల్ ఆఫ్ ఫ్రీడమ్ మూమెంట్” పేరిట ఓ సెమినార్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా JIH ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు సలీముల్లా ఖాన్ మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా వివిధ మూలాల నుండి చారిత్రక వాస్తవాలను సంకలనం చేసి అందించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
స్వార్థ ప్రయోజనాల కోసం ముస్లింల సహకారాన్ని విస్మరించి చరిత్రను తిరగరాసే ప్రస్తుత ధోరణి దేశంలో అపార్థాలు, మత విద్వేషాలను సృష్టిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
“ఢిల్లీలో ఉన్న చారిత్రక వాస్తవాలు, వారసత్వ, స్మారక చిహ్నాల సమాచారాన్ని సేకరించేందుకు మేము ప్రయత్నాలు చేస్తున్నాము, దానిని త్వరలోనే ప్రజలకు అందజేస్తాము” అని సలీముల్లా ఖాన్ చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన పాట్నాలోని ప్రఖ్యాత ఖుదా బక్ష్ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ మాజీ డైరెక్టర్ అయాష్ ఖాన్ను మాటలను ఉటంకించారు. చారిత్రక వాస్తవికత, చరిత్రకారుల మధ్య వ్యత్యాసాన్ని హైలైట్ చేశాడు, తరచుగా వ్యక్తిగత ఆసక్తులు, అభిరుచుల కారణంగా చరిత్ర ప్రభావితమవుతుందని చెప్పారు.
ప్రఖ్యాత ఇస్లామిక్ పండితుడు మౌలానా సద్రుద్దీన్ ఇస్లాహిని కూడా సలీముల్లా ఖాన్ ఉదహరించారు. నిజమైన చరిత్ర రచన ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పాడు. వ్యక్తిగత ఎజెండాలకు అనుగుణంగా చారిత్రక కథనాలను సవరించడాన్ని ఖండించాడు. ప్రస్తుత వాతావరణంలో నిజమైన చరిత్రను రాయడం మానవాళికి గణనీయమైన సేవ అని ఆయన నొక్కి చెప్పారు.
జమాత్ ఇస్లామీ వైస్ ప్రెసిడెంట్ ప్రొ. సలీం ఇంజనీర్ తన అధ్యక్ష ప్రసంగంలో… ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇస్లామోఫోబియా, దేశంలో ముస్లింలపై పెరుగుతున్న ద్వేషం, ప్రచారం మధ్య సెమినార్ థీమ్ సమయానుకూలంగా, సముచితంగా ఉందని ప్రశంసించారు. ముస్లింల త్యాగాలను, విస్మరణకు గురైన రచనలను దేశానికి అందించడం ద్వారా ఈ కథనాలను ఎదుర్కోవాలని ఆయన పండితులు, విద్యావేత్తలను కోరారు.
“ఈ ప్రభుత్వం కేవలం రాజకీయ పార్టీ ప్రభుత్వం కాదు, సైద్ధాంతికమైనది” అని ప్రొఫెసర్ సలీం పేర్కొన్నారు.
“వారి ఎజెండాలో ముస్లింలు, ఇస్లాంకు వ్యతిరేకంగా సమాజంలో ద్వేషం, విభజనలు ఉన్నాయని” ప్రొ.సలీం పునరుద్ఘాటించారు. పక్షపాత ధోరణిలో చరిత్రను తిరగరాయడానికి పాలక ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎత్తిచూపారు.
బ్రిటీష్ వలసవాదానికి వ్యతిరేకంగా సహకార స్ఫూర్తిని గుర్తుకు తెచ్చేలా… ఐక్యతను పెంపొందించడానికి సూచించే చరిత్ర భవిష్యత్తుకు పాఠంగా ఉపయోగపడుతుందని ఆయన నొక్కి చెప్పారు. ముస్లింలపై పెరుగుతున్న దుష్ప్రచారాన్ని, ద్వేషాన్ని ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా మరిన్ని సదస్సులు,సెమినార్లు అవసరమని ఆయన నొక్కి చెప్పారు.
అన్యాయాన్ని మరియు అణచివేతను ప్రాథమికంగా వ్యతిరేకించే ఇస్లామిక్ బోధనల ద్వారా స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింల భాగస్వామ్యం ప్రేరణ పొందిందని JIH ఉపాధ్యక్షుడు నొక్కిచెప్పారు. బ్రిటీష్ వలసవాద చరిత్రను వక్రీకరించడం, ముస్లింలు, ఇస్లాం పట్ల పక్షపాతంతో చరిత్రను తిరగరాయడానికి పాలక యంత్రాంగం చేస్తున్న ప్రస్తుత ప్రయత్నాలను ఆయన విమర్శించారు.
స్వాతంత్య్ర పోరాటంలో అసమాన ధీరులు
భారతదేశంలోని ముస్లింల చరిత్రపై అనేక పుస్తకాలను రచించిన ప్రముఖుడు సయ్యద్ ఉబైదుర్ రెహమాన్, స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింల కృషిని సమగ్రంగా అందించారు.మనందం ఇంతకాలం పేర్కొంటున్నట్లు 1857 తిరుగుబాటుకు ముందే 1819 నాటి ఫరైజీ ఉద్యమాన్ని మొదటి స్వాతంత్ర్య ఉద్యమంగా ఆయన పేర్కొన్నారు.
“1819లో హాజీ షరియతుల్లా ప్రారంభించిన ఫరైజీ ఉద్యమం కేవలం మతపరమైన సంస్కరణల ఉద్యమం మాత్రమే కాదు, బ్రిటిష్ వలసవాదులకు వత్తాసు పలుకుతున్న భూస్వాములపై తిరుగుబాటు” అని సయ్యద్ ఉబైద్ వివరించారు. 50 నుండి 60 సంవత్సరాల పాటు సాగిన ఈ ఉద్యమం గణనీయమైన త్యాగాలను, ప్రభావాన్ని అందించిందని ఆయన ఉద్ఘాటించారు.
సయ్యద్ ఉబైద్ 1857 తిరుగుబాటులో చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ పాత్రను కూడా హైలెట్ చేశాడు. “జాఫర్కు ఒరిగేదేమీ లేదు, ఎందుకంటే అతను బాధ్యతలు చేపట్టకముందే మొఘల్ పాలన అత్యల్ప స్థాయికి దిగజారింది” అని ఆయన స్పష్టం చేశారు. “కానీ స్వేచ్ఛ కోసం, అతను బ్రిటిష్ రాజ్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసాడు, తన విలాసవంతమైన జీవితాన్ని, అధికారాన్ని విడిచిపెట్టాడు” అని అతను గుర్తు చేశారు.
ఇమామ్ బక్ష్ సాహబాయి, ముఫ్తీ సద్రొద్దీన్ అజూర్దా, మౌలానా ఆజాద్ సుభానీ, మౌల్వీ అబ్దుల్లా షాతో సహా గొప్ప త్యాగాలు చేసిన అనేక మంది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులను రచయిత పరిచయం చేశారు.
సయ్యద్ ఉబైదుర్ రెహమాన్, స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్రలు పోషించిన మౌల్వీ అబ్దుల్లా షా, అజీముల్లా ఖాన్లతో సహా అనేకమంది అసమాన ధీరులను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇమామ్ బక్ష్ సాహబాయి, మౌలానా జాఫర్ థానేస్వి,మౌల్వి లియాఖత్ అలీ వంటి అనేకమంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఆయన సభికులకు గుర్తు చేశారు, వీరంతా భారతదేశ స్వాతంత్ర్యం పట్ల అచంచలమైన నిబద్ధతను ప్రదర్శించారు, తరచుగా వారి జీవితాలను, స్వేచ్ఛను పణంగా పెట్టారని ఆయన అన్నారు.