హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కొత్త ప్యానెల్ ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డు రాజకీయ ప్రభావంతో కాకుండా స్వతంత్రంగా పనిచేయాలని మైనారిటీ కార్యకర్తలు, సామాజిక వేత్తలు బోర్డును డిమాండ్ చేశారు. ఫిబ్రవరి ఆఖరులో జరగనున్న వక్ఫ్ బోర్డు ఎన్నికలకు ఎమ్మెల్సీ కోటా కింద టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ నామినేషన్ దాఖలు చేశారు. దీనిని హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ప్రతిపాదించారు. ఎమ్మెల్యే కోటా కింద ఏఐఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ నామినేషన్ దాఖలు చేశారు. ఉపసంహరణకు ఫిబ్రవరి 21 చివరి తేదీ. ఫిబ్రవరి 28న ఫలితాలు ప్రకటించే సమయానికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కొత్త సభ్యులు ఫిబ్రవరి 29న బోర్డు ఛైర్మన్ను ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో సామాజిక కార్యకర్త ఆసిఫ్ హుస్సేన్ సోహైల్ మాట్లాడుతూ… బోర్డు సభ్యత్వం కోసం నామినేషన్లు దాఖలు చేసే ప్యానెల్ సభ్యులు తప్పనిసరిగా అధిక విద్యార్హత కలిగి ఉండాలి. వక్ఫ్ చట్టాలపై తగినంత జ్ఞానం కలిగి ఉండాలి. వారు వక్ఫ్ భూములతో సహా బోర్డు, ఆస్తులు, వంటి మిగతా సమస్యలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. అలా అయితేనే ఎన్నికయిన ప్యానెల్ సభ్యుడు, వక్ఫ్ ఆస్తిని దుర్మార్గులనుంచి రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తప్పనిసరిగా పూర్తిస్థాయి IAS అధికారి ఉండాలి. అసలు 2018 నుండి రాష్ట్ర ప్రభుత్వం రికార్డు గదిని సీలు చేసిందని సోహైల్ చెప్పారు. ఈ కారణంగా వక్ఫ్ ఆస్తులను బోర్డు కోల్పోతోంది. కనీసం ఇప్పుడు ఎన్నికయ్యే కొత్త ప్యానల్ అయిన రికార్డు గదిని తెరిచే న్యాయపరమైన అధికారాలు కలిగి ఉండాలి’’ అని ఆయన అన్నారు. ‘తెహ్రీక్ ముస్లిం షబ్బాన్‘కు చెందిన ముస్తాక్ మాలిక్ బోర్డు వైఫల్యాలను ఎత్తిచూపుతూ… మణికొండ జాగీర్లోని దర్గా హజారత్ హుస్సేన్ పరిధిలోని లక్ష కోట్ల విలువైన 1,662 ఎకరాల భూమిని కాపాడడంలో విఫలమైందని అన్నారు. ‘‘ఈ భూమి… వక్ఫ్ బోర్డు 70 ఏళ్ల బడ్జెట్గా ఉంటుంది. దర్గా హుస్సేన్ షా వలీపై దావాను ప్రభుత్వం ఉపసంహరించుకుని దానిని వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని మాలిక్ డిమాండ్ చేశారు. సంబంధిత పత్రాలన్నీ ఉన్నప్పటికీ బోర్డు భూమిని కోల్పోయింది” అని ఆయన అన్నారు. బోర్డు స్వతంత్రంగా పనిచేయాలని, కానీ రాజకీయ ప్రభావంతో పని చేయకూడదని ముస్తాక్ మాలిక్ డిమాండ్ చేశారు. “ప్రస్తుత లేదా రాబోయే ఏ ప్యానెల్ అయినా వక్ఫ్ ఆస్తులను కాపాడదు, మైనారిటీల కోసం ఏమీ చేయదు. గత పాలక పార్టీలతో సహా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వక్ఫ్ భూములను కాపాడడంలో విఫలమయ్యాయి. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులు, భూములు నష్టపోవడానికి అన్ని ప్రభుత్వాలది బాధ్యత’’ అని మాలిక్ ఎత్తిచూపారు. ఇటీవల ఐదు మసీదులు, రెండు అషూర్ఖానాలను కూల్చివేసినా వాటిని రక్షించడంలో బోర్డు విఫలమైంది. సచివాలయంలోని రెండు మసీదులు మినహా మిగతావన్నీ నిర్లక్ష్యానికి గురయినా వక్ఫ్ బోర్డు ఏమీ చేయలేకపోయిందని ఆయన వాపోయారు.