- అన్ని మత గ్రంథాలూ నైతిక విలువలనే బోధిస్తాయి
- సర్వమత సమ్మేళనంలో మహిళా ప్రతినిధులు నినదించారు
సమాజంలో నైతిక విలువలను కాపాడుకోవడం ఇప్పుడు అత్యవసరమని, నేటి పిల్లలకు నైతిక విలువలను తరగతి గదినుంచే బోధించాలని, విలువలు తగ్గిపోవడం వల్లనే సొసైటీలో నేరాలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని పలువురు మహిళా ధార్మిక నాయకులు ఉద్ఘాటించారు. ‘నైతికతే నిజమైన స్వేచ్ఛ’ అంశంపై వివిధ మతాలకు చెందిన మహిళా నాయకులు ప్రసంగించారు. ఆదివారం నాంపల్లి మదీనా ఎడ్యుకేషన్ సెంటర్ కాన్ఫరెన్స్ హాల్ లో ‘నైతిక విలువలను కాపాడుకోవడం ఎలా’ అంశంపై చర్చించారు.
నిజమైన స్వేచ్ఛ అపరాధ భావన, సామాజిక ఒత్తిళ్లు, నైతిక గందరగోళం నుండి మనకు విముక్తిని కలిగిస్తుందని జుహా అన్నారు. మీతిమీరిన స్వేచ్ఛ వల్ల కోరికలకు నియంత్రణ లేకుండా పోతుందని, నైతిక విలువలన్నీ విస్మరించబడతాయని ఆమె పేర్కొన్నారు. నైతిక విలువల పతనంతో కుటుంబ వ్యవస్థ దెబ్బ తింటుందని రిటా సురాణా అన్నారు.
మనమంతా నైతిక విలువలు పెంపొందించుకొంటే సమాజంలో సమానత్వం, దయ, జాలి గుణాలు పెరుగుతాయని అంతా ముక్తకంఠంతో చెప్పారు. విద్యాసంస్థల్లో విద్యార్థులకు విద్యా పరంగా సమర్ధవంతమైన జ్ఞానాన్ని అందించడమే కాకుండా నైతిక విలువలనూ బోధించాలని ప్రభ మల్లవరపు అన్నారు.
జమాఅతె ఇస్లామీహింద్ అసిస్టెంట్ సెక్రటరీ జుహా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జైన్ సొసైటీ ప్రవక్త రిటా సురానా, సిఖ్ స్కాలర్ భుపేందర్ కౌర్, సంత్ నిరంకారి సత్సంగ్ ఇన్ ఛార్జి బసంత్ కౌర్, సెంట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రభ మల్లవరపు, కిన్నెర్ వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ చంద్రిక దేవి, కల్వరి ఆరాధన టీవీ వక్త రమ కిరణ్, జమాఅతె ఇస్లామీహింద్ మహిళా ప్రతినిధులు అస్రా ముహ్సినా, ఆయిషా తదితరులు పాల్గొన్నారు.