బెంగళూరు: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్థలం కేటాయింపు కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మైసూరులోని లోకాయుక్త పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో సిద్ధరామయ్యను మొదటి ముద్దాయిగా, ఆయన భార్య పార్వతిని రెండో ముద్దాయిగా పేర్కొన్నారు. పార్వతి సోదరుడు మల్లికార్జునస్వామి, భూమి యజమాని దేవరాజులు మూడు, నాలుగో నిందితులుగా ఉన్నారు.
దేవరాజు వద్ద నుంచే మల్లికార్జున స్వామి భూమిని కొని పార్వతికి బహుమతిగా ఇచ్చాడని చెప్తున్నారు. తక్కువ విలువ కలిగిన ఈ భూమిని అభివృద్ధి పనుల కోసం మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) సేకరించి, పరిహారంగా పార్వతికి ఖరీదైన 14 స్థలాలను కేటాయించిందనే ఆరోపణలు ఉన్నాయి.
ముఖ్యమంత్రి భార్యకు మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ (ముడా) అక్రమంగా సైట్లను కేటాయించిందంటూ ఓ సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. లోకాయుక్త నుండి ఎఫ్ఐఆర్ కాపీని అందుకున్న తర్వాత ఈ ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ స్పందిస్తూ ఈ చర్యతో రాజ్యాంగం సమున్నతమైనదని రుజువైందని వ్యాఖ్యానించారు.
లోకాయుక్త ఎస్పి టి.జె.ఉదేష్ శుక్రవారం ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. లోకాయుక్త రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నందున ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేసే అవకాశం వుంటుందని, అందువల్ల సిబిఐకి బదిలీ చేయాలని పిటిషనర్ కోరారు.
సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటూ సిద్ధరామయ్య మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. ఇది ముడా స్కామ్లో సీబీఐ విచారణ నుంచి తప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నమని బీజేపీ అధికార ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా పేర్కొన్నారు.