హైదరాబాద్: దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్సీఎల్ హైటెక్ సిటీలో తన నూతన కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనుంది. 5,000 మంది ఇంజనీర్లకు ఉద్యోగావకాశాలు కల్పించే కొత్త హెచ్సిఎల్ క్యాంపస్ ప్రారంభం కానుంది.
శుక్రవారం సచివాలయంలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఛైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు.
విద్యా వనరులను మెరుగుపరచడానికి, విద్యార్థులకు శిక్షణను మెరుగుపరచడానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీతో హెచ్సిఎల్ భాగస్వామి అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యువతకు ప్రయోజనం చేకూర్చే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై హెచ్సిఎల్తో సహకరించడానికి ప్రభుత్వం నిబద్ధతతో ఉందని సిఎం ఉద్ఘాటించారు.
తెలంగాణలో ఉపాధి అవకాశాల కల్పనకు హెచ్సిఎల్ చేస్తున్న కృషిని రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రభుత్వ మద్దతు మరియు సహకారాన్ని కంపెనీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. హెచ్సిఎల్తో వ్యూహాత్మక భాగస్వామ్యం యువతకు ఉద్యోగాలు కల్పిస్తుందని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన నొక్కి చెప్పారు. యువత సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లలో భాగస్వామ్యానికి హెచ్సిఎల్ ఆసక్తిగా ఉందని రోష్ని నాడార్ స్పందించారు. HCL GUVI ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూనే సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి సారిస్తుంది.
హెచ్సీఎల్ రెండేండ్ల కిందట తమ నైపుణ్య విభాగం గువీని ప్రారంభించింది. దీంతో దేశీయ భాషల్లో సాంకేతిక కోర్సులను అందిస్తోంది. ప్రధానంగా సాంకేతిక విద్యలో భాషా అవరోధాలు తొలగించేందుకు కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి, హెచ్సిఎల్ ప్రతినిధులు స్కిల్ యూనివర్శిటీ, హెచ్సిఎల్ విద్యా కార్యక్రమాలను తెలంగాణలోని ఇతర విశ్వవిద్యాలయాలకు విస్తృత ప్రేక్షకులకు ప్రయోజనం చేకూర్చడానికి ప్రణాళికలను కూడా చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తదితరులు పాల్గొన్నారు.