చెన్నై: చేపాక్ సీటును గెలుచుకున్న కొద్ది నెలలకే తొలిసారి ఎమ్మెల్యే అయిన ఉదయనిధి స్టాలిన్కు మంత్రి పదవి లభించడంపై ద్రవిడ మున్నేట్ర కజగంలోని సీనియర్లు మొదట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కోపంతో ఉన్న సీనియర్లతో బ్యాక్రూమ్ చర్చలలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చర్చలు జరిపి వారిని శాంతింపజేశారు. ఇక అంతా సద్దుమణిగాక సీఎం స్టాలిన్ తన కుమారుడిని ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్ ఇస్తూ తాజాగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను ప్రకటించారు.
డీఎంకే ముందుచూపు వ్యూహంలోనే భాగంగా డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ను ప్రమోట్ చేశారని చెబుతున్నారు. ఇక స్టాలిన్ మంత్రివర్గంలో కొత్తగా నలుగురికి చోటు దక్కింది. ముగ్గురికి ఉద్వాసన పలికారు. ఆరుగురు మంత్రుల శాఖలను మార్చారు సీఎం స్టాలిన్. మంత్రిగా సెంథిల్ బాలాజీ ప్రమాణం చేశారు. మనీ లాండరింగ్ కేసులో జైలు పాలైన సెంథిల్ బాలాజీ….రెండు రోజుల క్రితమే జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం డీఎంకే రెడీ అవుతోంది. దీనిలో భాగంగానే తన కుమారుడికి స్టాలిన్ ప్రమోషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ప్రమాణ స్వీకారోత్సవానికి బయలుదేరేముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉపముఖ్యమంత్రి అనేది తనకు పదవి కాదని, ఓ పెద్ద బాధ్యతని అన్నారు. మరోవైపు ఉదయనిధికి డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించడంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి.
జూనియర్ స్టాలిన్ను ‘యువరాజు’గా అభివర్ణించిన అన్నాడీఎంకే.. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎంకే పతనానికి ఇదో సూచిక అని విమర్శించింది. తమ కుటుంబం నుంచి ఎవరూ పార్టీలోకి రారంటూ 2021 ఎన్నికలకు ముందు స్టాలిన్ చెప్పారని గుర్తుచేసింది. ప్రజాస్వామ్యం పేరుతో కుటుంబ పాలన కొనసాగుతోందని, రాష్ట్రానికి ఇదో చీకటి రోజు అని విమర్శలు గుప్పించింది. కుటుంబ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందంటూ భాజపా కూడా విమర్శలు గుప్పించింది. కూటమిలో ఇతర పార్టీలు ఉన్నప్పటికీ.. వాటికి ప్రాధాన్యం కల్పించడం లేదని విమర్శించింది.