హైదరాబాద్: సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు అప్పారెల్ పార్కులో జౌళి పారిశ్రామిక సంస్థ టెక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ (టీఐపీఎల్) రెడీమేడ్ బట్టల ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో టెక్స్పోర్ట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, టెక్స్పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర డీ గోయెంకా ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. సిరిసిల్ల మెగా అపెరెల్ పార్కులోని 7.42 ఎకరాల స్థలంలో రూ.60 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను స్థాపించనున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది.. ఈ పరిశ్రమ ద్వారా 2 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 3 వేల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందని సంయుక్తంగా ప్రకటించారు.
@రెండు నెలల్లో శంకుస్థాపన.. ఏడాదిలో ఉత్పత్తి ప్రారంభం
“మా సంస్థ 1978లో బెంగళూరులో రెడీమేడ్ దుస్తుల ఉత్పత్తిని చేపట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19 పరిశ్రమలను నిర్వహిస్తోంది. సంవత్సరానికి 1.70 కోట్లకు పైగా చొక్కాలు, ప్యాంట్లు, టీషర్ట్లు, జాకెట్ కోట్లు తదితరాలు తయారుచేస్తూ.. వాటిలో 80 శాతం విదేశాలకు ఎగుమతి చేస్తోంది. రూ.620 వార్షిక ఆదాయంతో దేశవ్యాప్తంగా 15 వేల మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. తెలంగాణలో పరిశ్రమను ఏర్పాటుచేయాలని భావించి ప్రభుత్వాన్ని సంప్రదించాం. సిరిసిల్లలోని నేత కార్మికుల నైపుణ్యం, ఎగుమతులకున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని అక్కడే పరిశ్రమను నెలకొల్పాలనే నిర్ణయం తీసుకున్నామని” టెక్స్ పోర్ట్ సంస్థ ఎండీ గోయెంకా తెలిపారు. రెండు నెలల్లో శంకుస్థాపన చేసి, ఏడాది వ్యవధిలో ఉత్పత్తులు ప్రారంభిస్తామన్నారు.
@ మంత్రి కేటీఆర్ హర్షం…
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు టెక్స్పోర్ట్ సంస్థ ముందుకు రావడడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గొయెంకాకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి, వృత్తి నైపుణ్యం పెంపునకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. టెక్స్పోర్ట్ కంపెనీ సాధ్యమైనంత త్వరగా పరిశ్రమ ప్రారంభించేందుకు సర్కార్ తరఫున అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని హామీనిచ్చారు. ‘ఇప్పటికే సిరిసిల్ల అపెరెల్ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. కొత్త పరిశ్రమ ద్వారా నేతలన్నలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తాం’ అని కేటీఆర్ వెల్లడించారు.
The Govt of Telangana and Texport Industries Private Ltd (TIPL), entered into a Memorandum of Understanding (MoU) in the presence of Minister @KTRTRS today. pic.twitter.com/uqtjwbDzuc
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 25, 2022