విశాఖపట్నం: విశాఖలోని ఆర్కే బీచ్లో మిలాన్–2022 వేడుకలను ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం ఐఎన్ఎస్ విశాఖను జాతికి అంకితం చేశారు. కొత్తగా నావికాదళంలో చేరిన ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామిని సందర్శించారు. అక్కడి నుంచి ఆర్కే బీచ్కు చేరుకుని.. మిలాన్ వేడుకల్లో భాగంగా సిటీ పరేడ్ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… మొట్టమొదటి సారిగా విశాఖ సాగర తీరంలో మిలాన్–2022 నిర్వహణ చరిత్రలో మైలు రాయిగా నిలిచిపోతుందని సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. తూర్పు నావికాదళంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ విశాఖ చేరడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు. విశాఖ సాగర తీరంలో 39 దేశాలతో కలసి భారత నావికాదళం, తూర్పు నావికాదళం నిర్వహించిన విన్యాసాలు.. దేశ సైన్యం పట్ల మరింత నమ్మకాన్ని, అభిమానాన్ని పెంచుతాయని ఆయన చెప్పారు. వైజాగ్.. సిటీ ఆఫ్ డెస్టినీ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం. ఈ ప్రాంతం సంప్రదాయానికి ప్రతీక. విశాఖ చరిత్రలో ఇది మైలురాయి. ఇది అరుదైన యుద్ధ నౌకల విన్యాసాల పండగ. ఈ మిలాన్లో 39 దేశాలు పాల్గొనడం గర్వకారణమని సీఎం అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ పూర్తి స్వదేశీయంగా యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ విశాఖ’ను రూపొందించడం ఎంతో సంతోషం. ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌక కొద్ది నెలల క్రితం నావికాదళంలో చేరింది. పీ 15 బీ క్లాసెస్ గైడెడ్ మిసైల్ స్టెల్త్ డిస్ట్రాయర్ సాంకేతికతో పనిచేసే ఈ యుద్ధ నౌక తూర్పు నావికాదళంలోకి చేరడం ఇది విశాఖ ప్రజలకు ఎంతో గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు.
నౌక పై భాగంలో మన విశాఖపట్నంలో ప్రకృతి ప్రసాదంగా ఏర్పడిన డాల్ఫిన్ నోస్ని.. రాష్ట్ర మృగం కృష్ణ జింకని ప్రత్యేకంగా ముద్రించారు. ధన్యవాదాలు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామి కూడా తూర్పు నావికాదళంలో చేరడంతో ఈ ప్రాంత రక్షణలో మరో అధ్యాయం ప్రారంభమైంది. ఈ స్నేహ బంధం కొనసాగాలని సీఎం అన్నారు.
మిలాన్–2022 విన్యాసాలతో విశాఖ ప్రజలకు ఉత్సాహంతో పాటు.. దేశ రక్షణకు నిరంతరం పాటు పడుతున్న సైన్యం మీద గౌరవం, అభిమానం, నమ్మకం మరింత పెరుగుతుంది. మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం, ఇండియన్ నేవీ సంయుక్త నిర్వహణలో మిలాన్ వేడుకలకు విశాఖ కేంద్రం కావడం ఆనందంగా ఉంది. ఇక్కడి ఆతిథ్యం మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ సంప్రదాయాన్ని కొనసాగిద్దామని ఆయన పేర్కొన్నారు.
సిటీ పరేడ్లో పాల్గొన్న ఇండియన్ కోస్ట్గార్డ్, ఏపీ పోలీస్, ఫైర్ సర్వీస్ సీకేడెట్, ఎన్సీసీ, బ్యాండ్ ట్రూప్, కల్చరల్ ట్రూప్స్, స్నేహ పూర్వక దేశాల ప్రతినిధులకు ధన్యవాదాలు. ఇదే స్నేహ బంధం కొనసాగాలని కోరుకుంటున్నాను. భారత నౌకాదళానికి ప్రత్యేకంగా తూర్పు నావికాదళంతో పాటు అనేక దేశాల నుంచి వచ్చి ఈ విన్యాసాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక అభినందనలు. భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్గుప్తా, ఈ వేడుకల్లో పాల్గొన్న అంబాసిడర్లు, అధికారులు, ఇతర దేశాల ప్రతినిధులకుముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ధన్యవాదాలు చెబుతూ ప్రసంగాన్ని ముగించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన మిలన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కన్నుల పండువగా ప్రారంభమైంది నౌకాదళ విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశాయి. ఆకాశంలో రంగు రంగుల పక్షుల్లా మెరైన్ కమాండోలు ప్యారాచూట్ల సాయంతో స్కై డైవింగ్ చేస్తూ జాతీయ పతాకాన్ని, భారత నావికాదళం జెండాను చేతబట్టుకుని నేలకు దిగడాన్ని ప్రక్షకులు నిబిడాశ్చర్యంతో తిలకించారు. ఇంతలో.. మిగ్ 29 యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి.. సాగరాన్ని చీల్చుకుంటూ యుద్ధ నౌకల విన్యాసాలు, నింగీ, నేల, నీరు ఏకం చేసేలా సాగిన హెలికాఫ్టర్లు, చేతక్ల కదన కవాతు ఒళ్లు గగుర్పొరిచేలా సాగింది.. దివిపై.. భువిపై నౌకాదళ సిబ్బంది.. శత్రు సైన్యంపై పోరుని తలపించేలా 25 నిమిషాల పాటు సాగిన ఎన్నో అద్భుత విన్యాసాలకు విశాఖ తీరం వేదికైంది. తూర్పు నౌకాదళం వేదికగా ఈ మిలాన్ విన్యాసాలు మార్చి 4 వరకు జరగనున్నాయి. 39 దేశాలకు చెందిన 13 నౌకలు, జలాంతర్గాములు, యుద్ధవిమానాలు మిలాన్ విన్యాసాల్లో పాల్గొన్నాయి.