యూఎస్ఏ: తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్తో ఇవాళ.. కన్ఫ్ల్యూయెంట్ మెడికల్ సంస్థ డైరెక్టర్, సీఈవో డీన్ షావర్ భేటీ అయ్యారు. ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ డివైజెస్ తయారీ కంపెనీ కన్ఫ్ల్యూయెంట్.. హైదరాబాద్లో తమ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని కేటీఆర్కు తెలిపారు. ఏడాదిలోగా దాన్ని విస్తరిస్తామని చెప్పారు. నింతోల్ ఉత్పత్తుల తయారీ కోసం అగ్రశ్రేణి సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్ నగరానికి తీసుకువస్తున్నట్లు డీన్ షావర్ వెల్లడించారు. దేశంలో ఈ స్థాయి టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేసే మొదటి కంపెనీగా కన్ఫ్ల్యూయెంట్ నిలవనున్నట్లు వివరించారు. త్వరలోనే తమ కంపెనీ బయోమెడికల్ టెక్స్టైల్ సేవలకు సంబంధించి ప్రణాళికలను ప్రకటిస్తామన్నారు.
వైద్యరంగంలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడంలో తెలంగాణ ఎప్పుడూ ముందే ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కన్ఫ్ల్యూయెంట్ సంస్థ తయారీ ప్లాంట్ యూనిట్కు సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తామని కేటీఆర్ డీన్ షావర్కు హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఆ సంస్థతో తెలంగాణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పని చేద్దామని చెప్పారు.