వార్సా/ పోలెండ్: ఉక్రెయిన్ పై రష్యా దాడిని స్వేచ్ఛా ప్రపంచం వ్యతిరేకిస్తోందని, పుతిన్ ను కట్టడి చేసే విషయమై ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య ఐక్యత ఉందని.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శనివారం తన పోలాండ్ ప్రసంగంలో స్పష్టం చేయనున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. బైడెన్ నేడు పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడాతోనూ ప్రైవేటుగా సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్కు ఆయుధ సామగ్రి చేరవేత, ఇతర భద్రతా హామీలపై చర్చించనున్నట్లు సమాచారం.
బ్రస్సెల్స్లో జరిగిన నాటో అత్యవసర సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రష్యా దండయాత్రతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్కు పశ్చిమ సరిహద్దుల్లోని పోలెండ్లో జో బైడెన్ శుక్రవారం పర్యటించారు. ఉక్రెయిన్ సరిహద్దుకు కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెషోవ్ నగరానికి ఆయన వెళ్లారు. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో పోలెండ్ భద్రతకు భరోసా ఇచ్చేలా ఇటీవల అక్కడ అదనంగా మోహరించిన అమెరికా, నాటో సైనికులతో బైడెన్ మాట్లాడారు.
ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా రసాయన ఆయుధాలు ప్రయోగించినా తాము సంయమనం పాటిస్తామని అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ వెల్లడించింది. రష్యాపై విధించాల్సిన కొత్త ఆంక్షలు, ఉక్రెయిన్కు అదనపు సాయంపై నాటో సభ్య దేశాలతో బైడెన్ చర్చించారు.
మరోవంక అకారణంగా విరుచుకుపడిన రష్యా తీరును ఖండించి, ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని.. ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించడానికి నాటో దేశాలన్నీ ఐక్యంగా ఉన్నాయని సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్తెన్బర్గ్ చెప్పారు. రష్యాపై ఆంక్షల్ని కొనసాగించి, “దుర్మార్గ యుద్ధానికి” ముగింపు పలకాలనేది తమ నిర్ణయమని చెప్పారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రక్షణ రంగంలో పెట్టుబడులను పెంచాలన్నారు. కూటమిలో సభ్య దేశంపై ఎలాంటి దాడి జరిగినా స్పందించి, పరిరక్షించేందుకు నాటో ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. జీవ, రసాయన, అణ్వాయుధాలను వాడవద్దంటూ రష్యాకు జి-7 విజ్ఞప్తి చేసింది.