- సిలబస్ హేతుబద్ధత పేరుతో సిబిఎస్ఇ చర్యలు
- ఎన్సిఇఆర్టి సిఫార్సులే మేరకే నంటున్న అధికారులు
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) కొన్ని కీలక టాపిక్స్ను సిలబస్ నుంచి తొలగించింది. 11వ తరగతి, 12వ తరగతి పొలిటికల్ సైన్స్, హిస్టరీ సబ్జెక్టుల నుంచి అలీన ఉద్యమం, ప్రచ్ఛన్న యుద్ధ కాలం, ఆఫ్రో ఆసియా ప్రాంతాల్లో ఇస్లాం రాజ్య విస్తరణ, ముఘల్స్ కోర్టులు, పారిశ్రామిక విప్లవం టాపిక్స్ను తొలగించింది. ఇదే విధంగా పదో తరగతి సిలబస్ నుంచి ఫుడ్ సెక్యూరిటీ చాప్టర్లో వ్యవసాయంపై ప్రపంచీకరణ ప్రభావం అనే అంశం తొలగించారు. అలాగే ‘మతం, కమ్యూనలిజం, రాజకీయాలుా కమ్యూనలిజం, సెక్యులర్ స్టేట్’ సెక్షన్లో ఉర్దూ రచయిత ఫైయిజ్ అహ్మద్ ఫైజ్ రాసిన రెండు పద్యాల అనువాద భాగాలను కూడా ఈ ఏడాది సిలబస్ నుండి మినహాయించారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ‘ప్రజాస్వామ్యం వైవిధ్యం’ అనే కోర్సు కంటెంట్ అధ్యాయాల నుండి కూడా తొలగించారు. ఇలా పలు అంశాలను, అధ్యాయాలను సిలబస్ నుండి తొలగించడం వెనుక గల కారణంపై సీటీఐ వార్తా సంస్థ వారిని ప్రశ్నిస్తే… ఇదంతా, సిలబస్ హేతుబద్ధీకరణలో భాగంగానే మార్పులు చేశామని, ఇవి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) సిఫార్సులకు అనుగుణంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారని, ఆ వార్తా సంస్థ పేర్కొంది.
11వ తరగతి చరిత్ర సిలబస్లో తొలగించిన అధ్యాయం “సెంట్రల్ ఇస్లామిక్ ల్యాండ్స్” గత సంవత్సరం సిలబస్లోని వివరణ ప్రకారం ఆఫ్రో-ఆసియన్ భూభాగాలలో ఇస్లామిక్ సామ్రాజ్యాల పెరుగుదల, ఆర్థిక వ్యవస్థ, సమాజంపై దాని ప్రభావాలకు సంబంధించింది. ఇస్లాం యొక్క ఆవిర్భావం, కాలిఫేట్, సామ్రాజ్య నిర్మాణం యొక్క ఆవిర్భావం గురించి ప్రస్తావించింది.
అదేవిధంగా,12వ తరగతి చరిత్ర సిలబస్లో కూడా ఇదే రీతిలో మొగల్ కోర్టులు, వాటి చరిత్ర, మొఘలుల సామాజిక, మతపరమైన, సాంస్కృతిక చరిత్రలను పునర్నిర్మించిన తీరును వివరించే ‘ది మొఘల్ కోర్ట్: రీకన్స్ట్రక్టింగ్ హిస్టరీస్ త్రూ క్రానికల్స్’ అనే చాప్టర్ను కూడా తొలగించారు.
ఇక, కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో 2021-2022 విద్యా సంవత్సరం 10,12 తరగతుల బోర్డు పరీక్షలను రెండు టర్మ్లుగా నిర్వహించాలని సీబీఎస్ఈ బోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్స్ గతేడాది నవంబర్, డిసెంబరులలో పూర్తి అయ్యాయి. ఇప్పుడు టర్మ్ 2 పరీక్షల షెడ్యూల్ను సీబీఎస్ఈ బోర్టు విడుదల చేసింది. సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్లో ఉండే సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని బోర్డ్ విద్యార్థులకు సూచించింది
“సీబీఎస్ఈ ఏటా 9 నుండి 12 తరగతులకు అకడమిక్ కంటెంట్, అభ్యాస ఫలితాలతో పరీక్షల కోసం సిలబస్, బోధనా పద్ధతులు మూల్యాంకన మార్గదర్శకాలతో కూడిన పాఠ్యాంశాలను అందిస్తుంది. వాటాదారుల అభిప్రాయం ఇతర ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, బోర్డు వార్షిక మూల్యాంకన పథకాన్ని నిర్వహించడానికి అనుకూలంగా ఉంది. 2022-23 అకడమిక్ సెషన్ ముగింపు, దానికి అనుగుణంగా పాఠ్యాంశాలు రూపొందించబడ్డాయి, ”అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
అయితే, దశాబ్దాలుగా పాఠ్యాంశాల్లో భాగమైన కొన్ని అధ్యాయాలను సిలబస్ నుండి బోర్డు తొలగించడం ఇదే మొదటిసారి కాదు. సిలబస్ను హేతుబద్ధీకరించాలనే నిర్ణయంలో భాగంగా, 11వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకంలోని ఫెడరలిజం, పౌరసత్వం, జాతీయవాదం, లౌకికవాదం అధ్యాయాలు విద్యార్థులను అంచనా వేసేటప్పుడు పరిగణించబడవని సీబీఎస్ఈ 2020లో ప్రకటించింది. అప్పట్లో ఇది పెద్ద వివాదానికి దారితీసింది. దీంతో ఆయా అంశాలు 2021-22 అకడమిక్ సెషన్లో పునరుద్ధరించారు. పాఠ్యాంశాల్లో భాగంగా చేశారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education) 10, 12 వ తరగతుల టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26 నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను సీబీఎస్ఈ బోర్టు శుక్రవారం ప్రకటించింది. 10వ తరగతి పరీక్షలు మే 24వ తేదీన ముగియనుండగా.. 12వ తరగతి పరీక్షలు జూన్ 15న ముగియనున్నాయి. పరీక్షలను ఆఫ్ లైన్ మోడ్లోనే నిర్వహించనున్నట్టుగా సీబీఎస్ఈ బోర్డు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. సీబీఎస్ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ cbse.gov.in, cbse.nic.in వెబ్సైట్స్లో అందుబాటులో ఉంచినట్టుగా బోర్టు తెలిపింది.