హైదరాబాద్: రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలబడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రూపొందించిన కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం మరో మైలురాయి దాటింది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి శనివారం నాటికి ఈ పథకానికి ప్రభుత్వం రూ.11,653.97 కోట్లు ఆడబిడ్డల పెండ్లిళ్లకు కట్నంగా ఇచ్చింది. ఈ పథకానికి ప్రభుత్వం శనివారం రూ.1,850 కోట్లు విడుదల చేయటంతో రూ.11 వేలకోట్ల మైలురాయిని దాటింది. పథకం ద్వారా ఇప్పటివరకు 12,87,588 మంది ఆడబిడ్డలు లబ్ధి పొందారు. 2014 అక్టోబర్ 2న ప్రారంభమైన కల్యాణలక్ష్మి పథకం ప్రభుత్వ ఆశయాన్ని సాకారం చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నది. పథకం కింద పేదింటి ఆడబిడ్డల వివాహానికి ప్రభుత్వం రూ.1,00,116 ఆర్థిక సాయం అందిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కల్యాణలక్ష్మి/షాదీముబారక్కు రూ.2,750 కోట్లు ప్రతిపాదించింది. అందులో ఒక్క కల్యాణలక్ష్మి కోసమే రూ.1,850 కోట్లు కేటాయించి, ఆ మొత్తాన్ని ఒకేదఫాలో విడుదల చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది.
బడ్జెట్లో కల్యాణలక్ష్మి పథకానికి కేటాయించిన రూ.1,850 కోట్ల నిధులను సంపూర్ణంగా ఒకే దఫాలో మంజూరు చేయడమే అందుకు నిదర్శనం. పేదింటి ఆడబిడ్డలకు మేనమామలా రూ.1,00,116 అందిస్తూ అండగా ఉంటున్నారు.
నిధులను మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.