హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి నేడు తెలంగాణ గడ్డపై అడుగు పెడుతున్న వేళ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అమిత్షాకు బహిరంగ లేఖ రాశారు.. తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందంటూ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. 27 ప్రశ్నలతో అమిత్షాకు లేఖరాసిన మంత్రి కేటీఆర్.. తెలంగాణపై బీజేపీ ఎనిమిదేళ్లుగా వివక్ష కొనసాగిస్తోందని.. విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు. ప్రతిసారి వచ్చి స్పీచులు ఇచ్చి వెళ్లిపోవడం కేంద్ర నాయకులకు అలవాటుగా మారిందన్నారు కేటీఆర్.
తెలంగాణకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలు బీజేపీ నెరవేర్చలేదని ఫైరయ్యారు.. బీజేపీ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నది దశాబ్దాల డిమాండ్ అని.. కానీ, కోచ్ ఫ్యాక్టరీలకు డిమాండ్ లేదని కేంద్రం చేతులు దులుపుకుందని కేటీఆర్ లేఖలో ఫైరయ్యారు.. ఐఐఎం, ఐసర్,ఏన్ఐడీ, ట్రిపుల్ఐటీ, గిరిజన వర్సిటీ, నవోదయ విద్యాలయాల్లో ఏ ఒక్కటి కూడా కేటాయించలేదని విమర్శించారు.
తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని మంత్రి కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు. మరోసారి తెలంగాణ గడ్డపై అమిత్షా అడుగు పెడుతున్న వేళ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజల సాక్షిగా కేంద్రం దృష్టికి తేవడంతో పాటు వాటి కోసం తెగేదాకా కొట్లాడటం మా బాధ్యత అని మంత్రి కేటీఆర్ అన్నారు.
బహిరంగ లేఖలో కేటీఆర్ సంధించిన ప్రధాన ప్రశ్నలు..
- విభజన చట్టంలోని ఒక్క హామీనైనా కేంద్రం నెరవేర్చిందా..?
- కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్లో ఎలా వస్తుంది? కాజీపేటలో ఎందుకు పెట్టరు..?
- నవోదయ, ఐఐఎం, ఐసర్ విద్యాలయాలు ఎందుకు కేటాయించలేదు..?
- బయ్యారం ఉక్కు పరిశ్రమ హామీకి ఎందుకు తుప్పు పట్టించారు..?
- హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి అడ్డుకునేందుకు ఐటీఐఆర్ రద్దు కుట్ర కాదా..?
- ఐటీ రంగంలో అగ్రస్థానంలో తెలంగాణ ఉంది.. అలాంటిది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కు ఎందుకివ్వడం లేదు..?
- పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదు..?
- సాగునీటి హక్కులు దక్కకుండా చేస్తున్న తాత్సారంపై ఏం చెప్తారు..?
- హైదరాబాద్ ఫార్మాసిటికి ఎందుకు సాయం అందించడం లేదు..?
- ఢిపెన్స్ కారిడార్ ఎందుకు మంజూరు చేయడంలేదు..?