ఆంధ్రప్రదేశ్/ కోనసీమ: అమలాపురంలో మంగళవారం (మే 24) చెలరేగిన అల్లర్లకు కీలక సూత్రదారిగా భావిస్తోన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. నిందితులను గుర్తించడానికి ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరా ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాలతో 46 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఏడు కేసులును రిజిష్టర్ చేశారు.
విధ్వంసానికి పాల్పడినవారిని గుర్తించాం
‘సీసీటీవీ ఫుటేజీ, సామాజిక మాధ్యమాలు, స్పెషల్ బ్రాంచి ద్వారా ఫుటేజీలు సేకరించి విధ్వంసాలకు పాల్పడిన చాలా మందిని గుర్తించాం. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తాం. అన్ని జిల్లాల నుంచి సీనియర్ పోలీసు అధికారులు వచ్చారు. సంఘాలు, సామాజిక వర్గాల నాయకులతో మాట్లాడాం. చట్టానికి, పోలీసుశాఖకు సహకరించాలని కోరాం.’ – పాలరాజు, డీఐజీ, ఏలూరు రేంజి
ప్రభుత్వానికి నివేదిక
అమలాపురంలో మంగళవారం నాటి ఉద్రిక్త పరిస్థితులపై జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు చోటుచేసుకున్న పరిణామాలను.. విధ్వంసం తీరును నివేదికలో పేర్కొన్నారు. పరిస్థితిని ముందుగానే అంచనా వేసి ఈనెల 22న కోనసీమ జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీస్ చట్టం అమల్లోకి తెచ్చామన్నారు. కోనసీమ సాధన సమితి ఈ నెల 22న తలపెట్టిన ఆందోళనలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా నిలువరించామని, మరోమారు ఆందోళన విషయం ముందుగానే గుర్తించి ఈ నెల 24న ఉదయం 7 గంటల నుంచి అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కసారిగా 5వేల మంది వరకు వచ్చారని, కొందరిని కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించడానికి అనుమతించేటప్పుడే బయట దాడులకు పాల్పడ్డారని తెలిపారు. కాకినాడ జిల్లా నుంచి ప్రత్యేక బలగాలు రప్పించి నియంత్రించడంతో అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్తోపాటు.. ముమ్మిడివరం ఎమ్మెల్యే సోదరుడి టింబర్ డిపోలపై దాడులకు పన్నిన కుట్రను భగ్నం చేయగలిగామని నివేదికలో తెలిపారు.