24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

బడిగంట మోగింది…. రాష్ట్రంలో పునఃప్రారంభమైన స్కూళ్లు!

  • నేడు పాఠశాలలు పునఃప్రారంభం
  • ముగిసిన వేసవి సెలవులు
  • బడిబాటతో భారీగా విద్యార్థుల చేరిక
  • 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల బోధన
  • ‘మన ఊరు-మన బడి’తో  కార్పొరేట్‌ హంగులు

హైదరాబాద్: రాష్ట్రంలో బడిగంట మోగింది. దాదాపుగా 50రోజుల పాటు  వేసవి సెలవుల అనంతరం తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల పాఠశాలలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో 2022-23 ఏడాది నుంచి ఒకేసారి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగనుంది. (విద్యార్థులు కోరుకుంటే తెలుగు మాధ్యమం కూడా ఉంటుంది).

ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధన ప్రారంభించనున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా నెల రోజుల పాటు బ్రిడ్జి కోర్సు తరహాలో తరగతులు నిర్వహించనున్నారు. విద్యార్థులందరికీ తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో పుస్తకాలు అందించేందుకు రూ.120 కోట్లతో పాఠ్యపుస్తకాల ముద్రణ పూర్తయింది. విద్యార్థులకు 1.67 కోట్ల పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఉచితంగా యూనిఫాం, మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బడిబాటలో 70,698 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. ఈ కార్యక్రమం మరో వారం కొనసాగుతుందని విద్యాశాఖ వెల్లడించింది. పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల్ని సందర్శించి విద్యార్థులకు స్వాగతం పలకాలని ప్రభుత్వం సూచించింది.పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లకు శుభాకాంక్షలు

నూతన విద్యాసంవత్సరం ప్రారంభం సందర్భంగా తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంత్రి, సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలందరికి ప్రపంచస్థాయి విద్యను అందించేందుకు ఆంగ్లమాధ్యమ బోధన ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై శ్రద్ధపెట్టాలని సూచించారు.

మన ఊరు-మనబడి కార్యక్రమానికి రూ.7,289.54కోట్లు ఖర్చుచేస్తున్నామని, తొలిదశలో రూ.3,497 కోట్ల ఖర్చుతో 9,123 పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమానికి కేంద్రం నిధులిచ్చిందని భాజపా నాయకులు అబద్ధాలు చెబుతున్నారని, బండి సంజయ్‌ పేర్కొన్నట్లు రూ.2700 కోట్లు ఎక్కడున్నాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి నవోదయ పాఠశాలలు, గిరిజన విశ్వవిద్యాలయం తీసుకువచ్చిన తరువాతే సంజయ్‌ మాట్లాడాలని మంత్రి సూచించారు. ఐఐటీలు, ఐఐఎంలు, మెడికల్‌ కళాశాలలు దేశమంతా ఇచ్చి, రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపిందని ఆరోపించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles