హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు బాగా ఆసక్తి కనబరిచారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న బడి-బాట (అడ్మిషన్ డ్రైవ్)లో భాగంగా జూన్ 18 నాటికి 1,22,956 మంది విద్యార్థులు 1 నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఈ డ్రైవ్ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుంది.
ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు వచ్చారు. జూన్ 18వ తేదీన ఒక్కరోజే 3,000 మంది చిన్నారులు ప్రైవేట్ పాఠశాలనుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం పెద్ద విశేషం.
రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ, పురపాలక, జిల్లా పరిషత్ పాఠశాలల్లో I నుండి 8 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమ బోధనను ప్రవేశపెట్టినందున ఈ విధంగా జరిగిందని చెబుతున్నారు. అంతేకాదు అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ సహకారంతో మొత్తం 1.04 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యం కోసం శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం ద్విభాషా అంటే, ఇంగ్లీష్ మరియు తెలుగు పాఠ్యపుస్తకాలను కూడా అందిస్తోంది.
అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన ఊరు-మన బడి/మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మారిపోయాయి. మౌలిక సౌకర్యాలు సమకూరాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా 18,240 ప్రాథమిక, 3,164 ప్రాథమికోన్నత, 4,661 ఉన్నత పాఠశాలలతో సహా మొత్తం 26,065 పాఠశాలలు దశలవారీగా రూ.7,289.54 కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్ల వ్యవధిలో రూపుదిద్దుకోనున్నాయి. మొదటి దశలో పునరుద్ధరిస్తున్న 9,123 పాఠశాలల్లో 5,399 ప్రాథమిక పాఠశాలలు, 1,009 ప్రాథమికోన్నత పాఠశాలలు 2,715 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు మరియు సిబ్బందికి ఫర్నిచర్, పాఠశాల మొత్తం పెయింటింగ్, పెద్ద, చిన్న మరమ్మతులు వంటి 12 మౌలిక సదుపాయాలను చేపట్టి పాఠశాలల్నీ అభివృద్ధి చేస్తున్నారు.