హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా 98 సంవత్సరాలు కొనసాగిన కోఠి మహిళా కాలేజీ 2022-23 విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ మహిళా యూనివర్శిటీ(టీఎంయూ)గా మారింది. ఈమేరకు సోమవారం ఉత్తర్వులు విడుదల అయ్యాయి. అందువల్ల, విద్యార్థులందరూ దోస్త్-2022 వెబ్ పోర్టల్కు దరఖాస్తు చేసుకోవాలని, యూనివర్శిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ (OU)కు బదులుగా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం (మహిళా విశ్వవిద్యాలయం), కోటి, హైదరాబాద్లోని అండర్-గ్రాడ్యుయేట్ కోర్సులను ఎంచుకోవాలని అభ్యర్థించారు. యూనివర్సిటీ కోడ్ 11013 ద్వారా గుర్తించాలని విద్యార్థులను కోరారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏపీ మహిళా యూనివర్శిటీగా కొనసాగింది. రెండు రాష్ట్రాల విభజన అనంతరం తిరుపతిలో ఉన్న మహిళా విశ్వవిద్యాలయం ఏపీకి పరిమితం అయింది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంకు తెలంగాణ మహిళా యూనివర్శిటీ లేకుండా పోయింది. ఈ నేఫథ్యంలో కోఠిలోని ఉమెన్స్ కళాశాలను తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్పుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణకు కీర్తి కిరీటం
కోఠి మహిళా కాలేజీకి చారిత్రక వైభవం ఉండటంతో విశ్వవిద్యాలయంగా మారడంతో తెలంగాణ మహిళల ఉన్నత విద్యలో మహర్దశ మొదలవుతుందని విద్యావేత్తలు ఆశాభావం వెలిబుచ్చారు. విశ్వవిద్యాలయం వల్ల హైదరాబాద్కు మరింత పేరు ప్రఖ్యాతలు వస్తాయని చెప్పారు. ఈ వర్సిటీలో ఆధునిక కోర్సులు బోధించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను విజ్ఞప్తిచేశారు.