హైదరాబాద్: ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసినట్లు పార్లమెంట్లో కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ప్రకటనను మంత్రి కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీ ప్రభుత్వం చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని ఐటీ శాఖ మంత్రి అన్నారు. హామీలను నెరవేర్చడంలో విఫలమైన తెలంగాణ యువతకు బీజేపీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. దేశంలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనలో బీజేపీకి సరైన విధానం లేదని అన్నారు.
రాజకీయంగా విభేదిస్తున్నామన్న కారణంతో మోదీ సర్కార్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దుచేసి…. తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ తీరుతో హైదరాబాద్ ఐటీ పరిశ్రమ మరింతగా ఎదిగే అవకాశాన్ని కోల్పోయిందన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు పరిహారంగా ఇతర ప్రాజెక్టులను మంజూరు చేశామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఐటీ మంత్రి, బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను మరోసారి మోసం చేసిందన్నారు.
ఏ విషయంలోనైనా సులభంగా అబద్ధాలు చెప్పడం బిజెపి పార్టీ డిఎన్ఎలో ఉందని, సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇప్పుడు అప్రయత్నంగా అదే పని చేశారని కెటి రామారావు శుక్రవారం ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు. టీఆర్ఎస్ రాజకీయంగా కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్నందునే ఐటీఐఆర్ ప్రాజెక్టును బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని మంత్రి అన్నారు. చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేయడం వల్ల తెలంగాణ ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందే గొప్ప అవకాశాన్ని కోల్పోయిందని, “హైదరాబాద్లో ఐటీ రంగం విపరీతంగా అభివృద్ధి చెందడంలో కేంద్ర ప్రభుత్వ సహకారం లేదని” అన్నారు. 2008లో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్కు ఐటీఐఆర్ ప్రాజెక్టును ప్రతిపాదించగా 2013లో ఆమోదించింది. అయితే, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కొన్ని ఇతర ప్రాజెక్టులకు హామీ ఇచ్చినట్లే బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కనపెట్టి తెలంగాణకు శాపంగా పరిణమించింది’’ అని కేటీఆర్ అన్నారు.
ఐటి పరిశ్రమ బలోపేతం కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన పథకాన్ని ఇతర రంగాల్లోని కార్యక్రమాలను చూపి రద్దు చేయడం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికున్న విధానపరమైన నిబద్దతకు నిదర్శనమని కేటీఆర్ ఎద్దేశా చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, ఉత్తరప్రదేశ్ లకు లెక్కలేనన్నీ కేంద్ర పథకాలను మంజూరు చేసుకుంటూ, తెలంగాణకు వస్తున్న చారానా, ఆఠానా మందం పనులను కూడా సాకుగా చూపెట్టడం దారుణమన్నారు. ఐటీఐఆర్ కు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ ఐటీ పరిశ్రమకు మోడీ ప్రభుత్వం ఇచ్చిందేంటో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై ఇక్కడి ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నా… ప్రధాని మోడీలో చలనం రావడం లేదని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా పురోగమిస్తున్న తెలంగాణ ఐటి రంగ ప్రగతిని అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న మోడీ ప్రభుత్వ నికృష్ట రాజకీయానికి ఈమద్యనే ప్రకటించిన సాఫ్ట్ వేర్ పార్క్ లే సాక్ష్యం అన్నారు.దేశవ్యాప్తంగా 22 సాప్ట్ వేర్ పార్కులను ప్రకటిచించి తెలంగాణకు మెండిచేయి చూపడం బిజెపి ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ఉన్న చిన్నచూపుకు నిదర్శనమన్నారు.