న్యూఢిల్లీ: అయోధ్యలో భూ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు తనకు తానుగా(సుమోటో) విచారణ చేపట్టాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ఈ ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనాన్ని వీడాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నగర మేయర్, స్థానిక బిజెపి ఎమ్మెల్యే, బిజెపి మాజీ ఎమ్మెల్యేతోసహా 40 మంది అయోధ్యలో చట్ట విరుద్ధంగా ఇంటి స్థలాలను విక్రయిస్తూ అక్కడ మౌలిక సౌకర్యాలను నిర్మిస్తున్నారంటూ అయోధ్య అభివృద్ధి సంస్థ చేసిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేస్తూ శ్రీరాముడి పేరిట బిజెపి కుంభకోణానికి పాల్పడింది. హోం మంత్రి అమిత్ షా దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథ్ ఇక్కడి ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ… అయోధ్యలో భారీ ఆస్తి కుంభకోణం జరుగుతోందని 2021 జూన్ నుంచి తాము చెబుతున్నామని ఆరోపించారు. ఇప్పుడు అయోధ్య అభివృద్ధి సంస్థే రామాలయ నిర్మాణంలో భూ కుంభకోణం జరిగిందంటూ 40 మంది నిందితుల పేర్ల జాబితాను విడుదల చేసిందని సుప్రియా శ్రీనాథ్ తెలిపారు. ఈ జాబితాలో అయోధ్యకు చెందిన బిజెపి ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తా, బిజెపి మేయర్ రిషికేశ్ ఉపాధ్యాయ, బిజెపి మాజీ ఎమ్మెల్యే గోరఖ్నాథ్ బాబా, యుపి ప్రభుత్వానికి చెందిన పలువురు అధికారులు ఉన్నారని ఆమె తెలిపారు. భగవంతుడిపై విశ్వాసంతో ప్రజలు విరాళాలు అందచేశారని, ఆ డబ్బు చోరీకి గురవుతోందని ఆమె ఆరోపించారు.
ఈ అంశంపై ‘అమిత్ షా, మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? రామ మందిర నిర్మాణం జరుగుతున్న అయోధ్య లాంటి నగరంలో భూ కుంభకోణంలో మీ పార్టీకి చెందిన వారు సహకరించారని తేలిన తర్వాత వారు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించింది. రామ మందిర ట్రస్ట్ను స్థాపించిన సుప్రీం కోర్టు ఈ విషయాన్ని సుమోటోగా గుర్తించి ఈ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ప్రధాని మోదీ మౌనం వీడాలని కాంగ్రెస్ కోరుతోంది.
రామాలయ భూ కుంభకోణానికి సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అని కాంగ్రెస్ ప్రతినిధిని ప్రశ్నించగా…అడిగినప్పుడు, “నేను సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానని చెప్పలేదు; 15 మంది సభ్యులతో కూడిన రామాలయ ట్రస్ట్ను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన విషయం ప్రజలందరికీ తెలిసిందే, ఇప్పుడు అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ఈ భూ కుంభకోణంతో సంబంధం ఉన్న నిందితుల పేర్లను విడుదల చేసిందని నేను చెప్పాను. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా చేపట్టాలి. అత్యున్నత న్యాయస్థానం ఈ పని చేస్తుందని విశ్వసిస్తున్నాని సుప్రియా శ్రీనాథ్ చెప్పారు.
ప్రజలు విశ్వాసంతో విరాళాలు ఇచ్చారని, “ఆ విరాళం నుండి దొంగిలించడం” తప్పని ఆమె అన్నారు. భూ కుంభకోణంపై జిల్లా మేజిస్ట్రేట్ స్థాయిలో మాత్రమే విచారణ జరుగుతోంది. యూపీ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులపై ‘డీఎం’ ఎలా విచారణ జరుపుతారు’’ అని అన్నారు.
అయితే, మేయర్ ఉపాధ్యాయ్, ఎమ్మెల్యే గుప్తా నిర్దోషి అని అంటున్నారు. అయోధ్య అభివృద్ధి సంస్థ విడుదల చేసిన నేరస్థుల జాబితాలో వీరి పేర్లు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు అయోధ్యలో చట్టవిరుద్ధమైన భూముల కొనుగోళ్లు, అమ్మకాలపై అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ యూపీకి చెందిన కాంగ్రెస్ ఎంపీ లల్లూ సింగ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు లేఖ రాశారు.
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ సంబంధిత వార్తా నివేదికను ట్యాగ్ చేస్తూ, హిందీలో చేసిన ట్వీట్లో, “మర్యాద పురుషోత్తం రాముడి పేరుతో బీజేపీ స్కామ్. దీనిపై హోంమంత్రి అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారు? ట్వీట్ చేశారు.