హైదరాబాద్: వచ్చే మార్చి నాటికి దేశంలో 100శాతం మురుగుశుద్ధి చేస్తున్న నగరంగా హైదరాబాద్కు గుర్తింపు రానుందని మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే.టీ. రామారావు అన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (STP) ఏర్పాటు చేసినందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారులను ట్విట్టర్లో ఆయన ప్రశంసించారు.
విశ్వనగరం హైదరాబాద్లో ఉత్పత్తయ్యే మురుగునీటిని వందశాతం శుద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,866.21 కోట్ల వ్యయంతో 31 నూతన సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ)ను నిర్మిస్తున్నది. ప్రస్తుతం 40 శాతం మురుగు శుద్ధి అవుతుండగా, నూతన ఎస్టీపీల ద్వారా నిత్యం 1950 ఎంఎల్డీల నీటిని 100 శాతం శుద్ధి చేయాలన్న సంకల్పంతో పనులను వేగంగా నిర్వహిస్తున్నది. దేశంలోని 8 మెట్రో నగరాల్లో ఎక్కడా లేనివిధంగా నగరంలో అధికసంఖ్యలో ఎస్టీపీలు నిర్మిస్తుండడం విశేషం.
దసరా తర్వాత విడుతల వారీగా ఎస్టీపీలను అందుబాటులోకి తీసుకువస్తామని జలమండలి అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు ఒకటి, రెండు మినహా దాదాపు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా పూర్తి చేస్తామని, వచ్చే ఏడాది మార్చి నాటికల్లా వంద శాతం మేర ప్రాజెక్టు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
Am very proud of my @HMWSSBOnline team led by @MDHMWSSB Dana Kishore Garu & ED Satyanaryana Garu
With 100% sewerage treatment in #Hyderabad by next summer, our capital city will be a shining example for other Indian cities to emulate https://t.co/oVBycyxJei
— KTR (@KTRTRS) September 4, 2022
వచ్చే మార్చి నాటికి పనులన్నీ పూర్తయితే దేశంలో 100శాతం మురుగుశుద్ధి చేస్తున్న నగరంగా గుర్తింపు రానుందని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అర్వింద్కుమార్ మరో ట్వీట్ చేశారు.