నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్.. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలీక్యాప్టర్లో నిజామాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి.. ముందుగా ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో నిర్మించిన తెరాస జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు.
అనంతరం దుబ్బ ప్రాంతంలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు పూర్ణకుంభంతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, సీఎంవో అధికారి స్మితా సబర్వాల్తో కలిసి సమీకృత కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కూర్చుండబెట్టి.. పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం ప్రకటించారు, పాత కలెక్టరేట్ కాంప్లెక్స్ను ఎయిర్ కండిషన్డ్ ఇందూర్ కళా భారతిగా అభివృద్ధి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
ప్రస్తుతం ఉన్న రూ.5 కోట్ల నియోజకవర్గ అభివృద్ధి నిధులతో పాటు జిల్లాలోని మరో ఎనిమిది నియోజకవర్గాలకు ఒక్కొక్కరికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నిజామాబాద్లో అభివృద్ధి పనుల్లో పెనుమార్పు వచ్చిందని, ప్రజల సౌకర్యార్థం మరిన్ని పనులు చేయాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా మాట్లాడుతూ… దేశమంతా ఆశ్యర్యపోయేలా తెలంగాణను అభివృద్ధి చేసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. రైతులకు ఉచితంగా నిరంతర విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్న కేసీఆర్.. రైతులంతా మద్దతుగా నిలిస్తే దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. తెరాస పాలనలో తెలంగాణలో ఎక్కడా కరెంటు సమస్య లేదని.. భాజపా ప్రభుత్వం రైతుల మోటార్ల లెక్కలు తీయమంటోందని ఆరోపించారు.
ఎమ్మెల్యేలను కొనడం, ప్రభుత్వాలను కూలదోయడమే ప్రధాని మోదీ చేస్తున్న ఏకైక పని అని కేసీఆర్ విమర్శించారు. దేశ రాజకీయాల్లోకి రావాలని జాతీయస్థాయి రైతు నాయకులు కోరుతున్నట్లు సీఎం వెల్లడించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే నిజామాబాద్ గడ్డ నుంచే జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తానని ఆయన స్పష్టం చేశారు.
దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని, దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చూడాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు.