పాట్నా: రాబోయే లోకసభ ఎన్నికల్లో బీజేపీకి గట్టిపోటీ ఇచ్చేందుకు ఈ సారి ప్రతిపక్షాల సిద్ధం అవుతున్నాయి. బీహార్ రాష్ట్రంలో ఏర్పడిన విధంగానే జాతీయ స్థాయిలో కూడా మహాకూటమి ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. బీహార్లో మహాకూటమికి చెందిన ఇద్దరు అగ్రనేతలు – ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్కు చెందిన లాలూ యాదవ్ – ఆదివారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలవనున్నట్లు వర్గాలు తెలిపాయి.
ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత నితీష్ కుమార్, సోనియా గాంధీని కలవనున్నారు. 2015లో బీహార్ ఎన్నికల ముందు జరిగిన ఇఫ్తార్ విందులో సోనియాగాంధీని కలిశారు నితీష్. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరవుతారని ఇద్దరు బీహార్ నేతలు కూడా ఆశిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. కానీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం కేరళలో ఉన్నారు.
బీహార్ ముఖ్యమంత్రి ఈ నెల ఆరంభంలో తన ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీని కలిశారు. ఆ సమయంలో సోనియా గాంధీ వైద్య చికిత్స నిమిత్తం విదేశాల్లో ఉన్నారు. ఇక లాలూ యాదవ్ విషయానికొస్తే, 2018లో పశుగ్రాసం కుంభకోణం కేసుల్లో జైలు పాలయ్యాడు, ఆ తర్వాత అనారోగ్యంతో బెయిల్పై ఉన్నారు. కిడ్నీ మార్పిడి కోసం త్వరలో సింగపూర్కు వెళ్లనున్నారు.
బీహార్లో మహాకూటమికి చెందిన ఇద్దరు అగ్రనేతల ఢిల్లీ పర్యటన జాతీయ స్థాయిలో బీజేపీ కూటమికి చెక్ పెట్టేందుకేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా 2024 జాతీయ ఎన్నికలకు ముందు బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్ తన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో కూడా సోనియా-నితీష్-లాలు సమావేశం జరగనుండటం విశేషం. ఇక కాంగ్రెస్ అధినేత ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది