హైదరాబాద్: పెట్టుబడుల పేరుతో హవాలా రాకెట్ నడుపుతున్న తైవాన్, చైనాకు చెందిన హవాలా ముఠా పోలీసులకు చిక్కింది. దిల్లీ కేంద్రంగా మనీ ఎక్స్ఛేంజ్ పేరుతో దేశ వ్యాప్తంగా తొమ్మిది వందల కోట్ల రూపాయలకు పైగా మోసాలకు పాల్పడ్డ హవాలా ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు బుధవారం ఛేదించారు. మోసాల ద్వారా వచ్చిన సొమ్మును హవాలా, ఇతర మార్గాల్లో దేశం దాటిస్తున్నట్లు గుర్తించారు. వారి బ్యాంకు ఖాతాల్లోని రూ.1.91 కోట్ల నగదును నిలిపివేయించారు.
అధిక లాభాలను సాకుగా చూపి లక్షలాది మందిని మోసం చేసి రూ. 903 కోట్ల మేర మోసగించిన స్కామ్లో తైవాన్ జాతీయుడు, చైనా జాతీయుడు సహా పది మందిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుల విషయాన్ని బుధవారం విలేకరుల సమావేశంలో ప్రకటించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.. రంజన్ మనీ కార్ప్, కేడీఎస్ ఫారెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలు ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించాయని చెప్పారు. “రెండు కంపెనీలు మోసగాళ్లకు డబ్బును విదేశీ కరెన్సీగా మార్చడానికి సహాయం చేశాయి. ఆ తరువాత దానిని హవాలా ద్వారా విదేశాలకు పంపించాయి” అని సీపీ చెప్పారు.
ఈ రాకెట్లో ప్రధాన సూత్రధారి చైనాలో ఉన్నాడని, వివిధ దేశాల పౌరుల సహాయంతో భారతదేశంలో మోసం చేస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. “కంబోడియాలో కేంద్రం ఏర్పాటు చేసుకొని చైనా వాళ్లు పనిచేస్తున్నారు. ఈ డబ్బు చైనాకు వెలుతుంది. రూ.900 కోట్ల మోసానికి పాల్పడ్డారు. వర్చువల్ అకౌంట్లు, ఫేక్ అకౌంట్లను తెరుస్తారు. వర్చువల్ అకౌంట్లు ఏటంటే బ్యాంకింగ్ మించి పనిచేస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు కలిగించే విధంగా ఈ కేసు ఉంది” అనిహైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
చైనీస్ రహస్యంగా మన దేశంలో చొరబడి.. ఇలాంటి ఫ్రాడ్ ఆపరేషన్లు చేస్తున్నారని, ఇది హైదరాబాద్ సిటీ పోలీసులు సాధించిన అరుదైన ఘనత అని హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ హవాలా వ్యవహారం ఫెమా చట్టం ఉల్లంఘన అని ఆయన తెలిపారు. ఇది దేశవ్యాప్తంగా జరిగే మోసమని ఆయన చెప్పారు. దేశంలోనే.. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల పరిధిలోకి ఇలాంటి ఒక కేసు ఇప్పటివరకు రాలేదని ఈ సందర్భంగా సీవీ ఆనంద్ తెలిపారు. ఇలాంటి కేసును ఛేదించడం దేశంలోనే తొలిసారి అని, ఇది హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సాధించిన ఘనత అని ఆయన ప్రశంసించారు.