హైదరాబాద్: వక్ఫ్ సంబంధిత పనులు గత తొమ్మిది నెలలుగా పెండింగ్లో ఉన్నాయని, పెండింగ్ ఫైళ్లతో కార్యాలయం నిండిపోయిందని, పూర్తిస్థాయి సీఈవో లేకపోవడంతో ఫుల్టైం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను నియమించాలని తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
వక్ఫ్ బోర్డు ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షానవాజ్ ఖాసీం (ఐపిఎస్) ను రాష్ట్ర పోలీసు విభాగానికి తిరిగి పంపాలని గురువారం నాడు జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. బోర్డు చైర్మన్ మహమ్మద్ మసీవుల్లాఖాన్ ఆధ్వర్యంలో గురువారం బోర్డు సమావేశం నిర్వహించి సీఈవోగా ఉన్న ఐపీఎస్ అధికారిని.. తిరిగి మాతృసంస్థకు పంపాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.
వక్ఫ్ బోర్డుకు పూర్తిస్థాయి CEO లేనందున, దాని పనితీరుపై ప్రభావం పడుతుందని వక్ఫ్ బోర్డు చీఫ్ అన్నారు. మస్జిద్ ముయెజ్జిన్, ఇమామ్ల జీతాలతో సహా అనేక ముఖ్యమైన ఫైళ్లు క్లియరెన్స్ కోసం చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి.
“బోర్డు సమావేశానికి ఆరుగురు సభ్యులు హాజరయ్యారు. సభ్యులు డిఎస్పీ ఖాజా మొహియుద్దీన్ను వక్ఫ్ బోర్డు వర్కింగ్ ఇన్చార్జి సిఇఒగా నియమించారు. ఫుల్టైం సిఇఒను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించామని” వక్ఫ్ బోర్డు ఛైర్మన్ మసీవుల్లా చెప్పారు.
2003 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన షానవాజ్ ఖాసీం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణ కేడర్కు కేటాయించారు. షానవాజ్ ఖాసీం తొలిసారిగా మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్గా నియమితులయ్యారు. డిసెంబర్ 2020లో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమితులయ్యారు.