హైదరాబాద్: తెలంగాణలోని మంచిర్యాల పట్టణంలో ఓ పోలీసు తన స్నేహితులతో కలిసి బహిరంగంగా మద్యం సేవించి బీభత్సం సృష్టించాడు. స్నేహితులతో కలిసి సొంత డిపార్టుమెంట్కు చెందిన కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి అనే వ్యక్తి కరీంనగర్ జిల్లా బెజ్జంకిలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. తన స్నేహితులతో కలిసి మంచిర్యాల వచ్చిన తిరుపతి.. అర్థరాత్రి మద్యం సేవించి ఐబీ చౌరస్తాలో వీరంగం సృష్టించాడు.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. బ్లూ కోర్టు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బ్లూ కోర్టు సిబ్బంది.. ఎస్సై తిరుపతికి సూచించారు. ఎస్సై తిరుపతి వినిపించుకోకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఆగ్రహించిన ఎస్సై తిరుపతి తన స్నేహితులతో కలిసి బ్లూ కోర్ట్ సిబ్బందిపై దాడికి దిగారు. పోలీసులపై దాడిని స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.
తిరుపతి.. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. దీపావళి పండుగను పురస్కరించుకుని ఇంటికి వచ్చినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న పోలీసు, అతని స్నేహితుల కోసం గాలిస్తున్నారు.