హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆసుపత్రి భవన నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా ఆసుపత్రి పూర్వ విద్యార్థులతో సహా వైద్యులు నేడు… శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నుండి మెడికల్ కళాశాల వరకు ర్యాలీ చేపట్టనున్నారు.
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పాతకాలం నాటి భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో చాలా కాలంగా వార్తల్లో నిలుస్తోంది. పునర్నిర్మాణం కోసం ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. చారిత్రక కట్టడాన్ని పరిరక్షించాలని వారసత్వ కార్యకర్తలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కమిటీ సిఫార్సులు, హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని ఆసుపత్రి హెరిటేజ్ బ్లాక్ను పరిరక్షిస్తామని, కొత్త మౌలిక సదుపాయాలను నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
అయితే, ఇటీవలి కాలంలో ఆసుపత్రిలోని కొన్ని భాగాల పైకప్పులు కూలిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల మైనర్ ఆపరేషన్ థియేటర్లో రూఫ్ టాప్ కిందపడి సిబ్బందికి గాయాలయ్యాయి. ఇది యాదృశ్చికంగా జరిగిన సంఘటన కాదని, తరచూ ఇలా జరుగుతోందని, తాము ప్రమాదంలో పడ్డామని వైద్యులు తెలిపారు.
సాధారణంగా, ఆసుపత్రిలో 1,600 మంది ఔట్ పేషెంట్లు, 1,300 మంది ఇన్ పేషెంట్లు సేవలను పొందుతున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సగటున 150 చిన్న, పెద్ద శస్త్రచికిత్సలు జరుగుతాయి. నూతన ఆసుపత్రి నిర్మాణం కోసం పూర్వ విద్యార్థులు చేపడుతున్న ర్యాలీలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని ఉస్మానియా తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు సూపరింటెండెంట్ను కోరారు.
అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ .శ్రీకాంత్ మాట్లాడుతూ ఆసుపత్రిలో రోజురోజుకు ఔట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. రెండు రోజుల క్రితం 3,000 మంది పేషెంట్స్ జాయిన్ అయ్యారు. ఇక్కడేమో మౌలిక సదుపాయాలు కూడా లేవు. పాత భవనం యొక్క పైకప్పు కూలిపోవడం ప్రమాదకర వాతావరణానికి దారితీసిందని, కొత్త భవంతి నిర్మాణం చేపట్టాలని, అయితే అది త్వరగా జరగితే బాగుంటుందని అన్నారు.