హైదరాబాద్: కొత్త డీజీపీగా ఎవరు వస్తారో అని కొన్ని రోజుల నుంచి జోరుగా చర్చలు సాగుతున్న వేళ.. ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగా ఇంఛార్జ్ డీజీపీగా అంజనీకుమార్కు బాధ్యతలు అప్పగించింది.
డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి స్థానంలో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ అంజనీకుమార్ పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. పూర్తిస్థాయి డీజీపీ నియామకం జరిగేంత వరకు అంజనీ కుమార్ ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.
రాచకొండ సీపీ మహేశ్ భగవత్కు సీఐడీ డీజీగా బాధ్యతలు అప్పగించారు. అవినీతి నిరోధక శాఖ డీజీగా రవి గుప్తా, రాచకొండ కమిషనర్గా డీఎస్ చౌహాన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, శాంతిభద్రతల అదనపు డీజీగా సంజయ్ కుమార్ జైన్ నియమితులయ్యారు. తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ పదవికి పూర్తి అదనపు బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించారు. రవిగుప్తాకు విజిలెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
అంజనీ కుమార్ నేపథ్యం…
అంజనీ కుమార్ 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఏసీబీ డీజీగా ఉన్నారు. 2021 డిసెంబరు 24న ఏసీబీ డీజీ అయ్యారు. అంతకుముందు హైదరాబాద్ నగర కమిషనర్ గా పని చేశారు. ఐక్యరాజ్య సమితి శాంతి మెడల్ (పీస్ మెడల్) రెండుసార్లు అందుకున్నారు. ఐక్యరాజ్య సమితి తరపున 1998-99లో బోస్నియా దేశంలో పనిచేశారు.
బిహార్ రాజధాని పట్నాలోని సెయింట్ జేవియర్ స్కూల్లో, దిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఐపీఎస్ ట్రైనింగ్ లో మంచి ప్రతిభ కనపబరిచి రెండు కప్పులు గెలుచుకున్నారు. గతంలో జనగామ ఏఎస్పీగా పనిచేశారు. కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ చీఫ్ గా పనిచేయడంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో గ్రేహౌండ్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తించారు. నిజామాబాద్ డీఐజీగా, వరంగల్ ఐజీగా పని చేయటంతో పాటు హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అదనపు కమిషనర్ గా చేశారు.
2018 మార్చి 12న హైదరాబాద్ కమిషనర్ గా చేరారు. 2021 డిసెంబరు 25న ఏసీబీగా డీజీగా నియమితులయ్యారు. రాష్ట్రపతి పోలీస్ మెడల్ నక్సల్ ప్రాంతంలో పనితీరుకు గానూ, ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ అందుకున్నారు. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రపై విస్తృత పరిశోధన చేసిన అధికారిగా కూడా ఆయనకు పేరుంది.