కరీంనగర్: ప్రజలకు వైద్యసేవలందించడంలో తెలంగాణ ప్రభుత్వం భేషుగ్గా పనిచేస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు స్పష్టం చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన… జిల్లా కేంద్ర ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వినతిపై కరీనగర్లో 100 పడకల క్రిటికల్ కేర్ ఆస్పత్రిని మంజూరు చేశారు. ప్రతిమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వార్షిక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆరోగ్య మంత్రి ఇక్కడికి వచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత. దేశంలోనే అత్యధిక మెడికల్ సీట్లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ఆరోగ్య , విద్యా రంగంలో చివరి స్థానంలో ఉందని ఆయన అన్నారు.
డయాలసిస్ సేవల్లో తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా రాష్ట్రంలో కిడ్నీ రోగులకు అందిస్తున్న డయాలసిస్ సేవలను ప్రశంసించారు. గతంలో కరీంనగర్ జిల్లాకు నాలుగు మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది BRS ప్రభుత్వం. ఈ విద్యా సంవత్సరం నుంచే కరీంనగర్ మెడికల్ కళాశాల ప్రారంభమవుతుందని పేర్కొంటూ రూ.18 కోట్లు కేటాయించి కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ పారామెడికల్ కాలేజీలు కూడా ప్రారంభం కానున్నాయి.
కరీంనగర్ జిల్లా దవాఖానలో నెలకు 750 ప్రసవాలు జరుగుతున్నాయని, ఇంత ఒత్తిడిలో కూడా వైద్యులు, సిబ్బంది బాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. జిల్లా కేంద్రాసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్యం, సౌకర్యాలపై హర్షం వ్యక్తం చేస్తూ.. దవాఖానలో అందుతున్న సేవలకు ఎన్ని మార్కులు ఇస్తావని ఓ రోగిని ప్రశ్నిస్తే 90 మార్కులు వేస్తానని చెప్పారని… రోగులతో వైద్య సిబ్బంది ప్రేమ, అప్యాయతతో మెలగాలని మంత్రి సూచించారు. ఆసుపత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, నిధులు కేటాయించి ఆసుపత్రిని ఆధునీకరిస్తామని ఆరోగ్య మంత్రి హామీ ఇచ్చారు.