ఖమ్మం: ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులకు రూ.248.9 కోట్లకు పైగా నిధులు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు బుధవారం ప్రకటించారు. జేఎన్టీయూ పరిధిలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలతోపాటు ఖమ్మం సమీపంలోని మున్నేరు నదిపై పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి నిధులు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు.
ఖమ్మం శివారులో వి.వెంకటాయపాలెంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో 589 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, పెద్దతండా, కల్లూరు, ఏదులాపురం, తాళ్లాడ, నేలకొండపల్లి మేజర్ పంచాయతీలకు రూ.10 కోట్లు చొప్పున ముఖ్యమంత్రి ప్రకటించారు. జిల్లాలోని సత్తుపల్లి, మదిర, వైరా ఒక్కో మున్సిపాలిటీకి రూ.30 కోట్లు ప్రకటించారు. అంతేకాదు ఖమ్మం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేశారు. ఖమ్మంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యతను మంత్రులు టీ హరీశ్రావు, పువ్వాడ అజయ్కుమార్లకు సీఎం చంద్రశేఖర్రావు అప్పగించారు.