హైదరాబాద్: భారతీ ఎయిర్టెల్ గ్రూప్ హైదరాబాద్లో 2000 కోట్ల రూపాయల పెట్టుబడితో భారీ హైపర్స్కేల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దావోస్లోని తెలంగాణ లాంజ్లో పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ సమక్షంలో భారతీ ఎయిర్టెల్ గ్రూప్కు చెందిన సునీల్ భారతీ మిట్టల్, రాజన్ భారతీ మిట్టల్ ఈ విషయాన్ని ప్రకటించారు.
60 మెగావాట్ల సామర్థ్యంతో ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్ రాబోతుందని, డేటా భద్రతలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఈ డేటాసెంటర్ రాబోయే 5-7 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని ఎయిర్టెల్ పేర్కొంది.
తెలంగాణలో హైపర్ స్కేల్ డేటాసెంటర్లు ఏర్పాటుచేస్తున్న భారతీ ఎయిర్ టెల్ గ్రూప్ డేటా స్టోరేజ్, విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికత అయిన హైపర్ స్కేల్ డేటా సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటుకానుంది. తన అనుబంధ సంస్థ అయిన నెక్స్ట్రా ద్వారా భారతీ ఎయిర్ టెల్ ఈ డేటాసెంటర్ను నెలకొల్పుతుంది. ఈ సందర్భంగా ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు మాట్లాడుతూ ఎయిర్టెల్- నెక్స్ ట్రా తెలంగాణలో పెట్టుబడి పెట్టడం చాలా అనందంగా ఉందన్నారు. భారతదేశంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్లకు హైదరాబాద్ హబ్గా మారిందని, ఎయిర్టెల్ తాజా పెట్టుబడితో తాము ఆశిస్తున్న మరిన్ని ఫలితాలు వస్తాయని నమ్ముతున్నానని ఆయన తెలిపారు. ఎయిర్ టెల్, తెలంగాణ మధ్య ఈ సంబంధం ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నానన్నారు. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటి, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎయిర్టెల్- నెక్సాట్రాతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని కేటీఆర్ తెలిపారు.
భారతీ ఎయిర్టెల్ గ్రూప్ వ్యవస్థాపకుడు -చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ మాట్లాడుతూ హైదరాబాద్లో ఏర్పాటు చేయబోయే హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్లలో ఒకటి అని ఆయన తెలిపారు. తెలంగాణతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్నారు. 2022 మే లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల్లో ప్రారంభమైన డేటా సెంటర్ ఏర్పాటు చర్చలు నెలల వ్యవధిలోనే కార్యరూపం దాల్చడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా వేగంగా పని చేసిందన్నారు. ఇతర రంగాల్లోనూ తమ ఉనికిని, ముద్రను చాటుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు.