హైదరాబాద్: సికింద్రాబాద్ నల్లగుట్టలోని షాపింగ్ మాల్లో నిన్న భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ మాల్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి షాపింగ్మాల్ మొత్తానికి విస్తరించడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి. భవనంలో చిక్కుకున్న కొంతమందిని అగ్నిమాపక శాఖ సిబ్బంది మరియు స్థానిక పోలీసులు రక్షించగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లోని నల్లగుట్ట వద్ద ఉన్న డెక్కన్ నైట్వేర్ స్టోర్లో మంటలు చెలరేగాయి. భవనంలో చిక్కుకున్న పది మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.
పక్కనున్న భవనాలకు కూడా మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గుర్తించిన అధికార యంత్రాంగం భవనం చుట్టుపక్కల ఉన్న నివాసాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. 30 ఫైర్ ఫైటర్స్తో సాయంత్రానికి మంటలను అదుపులోకి తెచ్చారు. జలమండలి నుంచి 70 ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తూ మంటలు ఆర్పేందుకు చర్యలు తీసుకున్నారు. జనావాసాల మధ్య ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రభుత్వ యంత్రాంగం వెంటనే అప్రమత్తమై దాదాపు 12 గంటల పాటు ప్రాణాలకు తెగించి మంటలను ఆర్పివేశారు.
అగ్నిప్రమాద ఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ విచారణకు ఆదేశించారు. ప్రమాదం గురించి తెలియగానే ఫైర్ సేఫ్టీ డీజీ నాగిరెడ్డి పర్యవేక్షణలో సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ మంటలను ఆర్పడంలో అగ్నిమాపక సిబ్బంది తెగువతో శ్రమించారచి చెప్పారు. ఈ ఘటనలో పలువురు మరణించినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటించని గోదాంలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
రాంగోపాల్పేట్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని మూడు 11 కేవీ ఫీడర్ లైన్ల విద్యుత్ను నిలిపివేసినట్లు టీఎస్ ఎస్పీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జె.శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు పేర్కొన్నారు.